పెద్దఎత్తున మౌలిక సదుపాయాల కల్పనతో పర్యాటకులను మరింత ఆకర్షించే ప్రక్రియ కొనసాగుతోందని షెకావత్ తెలిపారు. సందర్శకులకు మంచి వసతి, ఆహారం, సులభతర రవాణా కీలకమని చెప్పారు. వారికి మరిన్ని వసతులు కల్పించడంలో వేగంగా ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. పర్యాటక ఆతిథ్యానికి భారతదేశం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని షెకావత్ వెల్లడించారు.
రాజమండ్రి అంటే గుర్తుకొచ్చేది గోదావరి తీరమని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తీరం వెంబడి నాగరికత, భాష అన్నీ పెరుగుతాయని చెప్పారు. ఆంధ్రుల అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మకు, ఆదికవి నన్నయ్యతో పాటు ఎంతోమంది కళాకారులకు జన్మనిచ్చిన నేల ఇది అని గుర్తు చేశారు. “పర్యాటక రంగంలో యువతకు ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయి. ప్రాజెక్టు పూర్తయితే ఏటా 4 లక్షలమంది సందర్శకులు పెరిగే అవకాశం. శక్తిమంతమైన నాయకులు, ప్రభుత్వం ఉంటే అభివృద్ధి వేగవంతమవుతుంది. విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపగలిగామంటే షెకావత్ కారణం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి షెకావత్ ప్రత్యేక కృషి చేస్తున్నారు” అని పవన్ కళ్యాణ్ తెలిపారు.
“డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే అభివృద్ధి సాధ్యమని ఆనాడు చెప్పాం. ప్రజలు మాపై నమ్మకం ఉంచి ఆశీర్వదించి గెలిపించారు. వికసిత్ భారత్లో వికసిత్ ఆంధ్రప్రదేశ్ ఒక భాగం. అమరావతి, పోలవరం ఇలా అన్నింటిలో కేంద్రం సహకారం అందిస్తోంది. అనేక పర్యాటక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకుంటున్నాం” అని పురందేశ్వరి చెప్పారు.

More Stories
శ్రీవారి సేవలో పట్టుకు బదులు పాలిస్టర్ శాలువాలు
2 నెలల పాటు పర్వదినాల్లో టిటిడి వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
ఏపీలో ‘అటల్ సందేశ్ – మోదీ సుపరిపాలన’ యాత్ర