ప్రమాద ఘడియల్లో శ్రీశైలం జలాశయం

ప్రమాద ఘడియల్లో శ్రీశైలం జలాశయం

ఉభయ తెలుగు రాష్ట్రాలకు కీలకంగా మారిన శ్రీశైలం జలాశయం ఇప్పుడు ప్రమాద ఘడియల్లో ఉంది. ఈ డ్యాం పునాదుల్లో భూగర్భ రాతిపొరల మధ్య పెళుసు అతుకులు ఉన్నట్టు జియాలజిస్టులు గుర్తించారు. ఇది గత ఏడాది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డిఎస్ఎ) కమిటీ కూడా స్పష్టం చేసింది. డ్యామ్ దిగువన ఏర్పడిన గుంత సుమారు 120 మీటర్ల లోతులో ఉంది. 

ఇది పునాదుల కన్నా కిందికి విస్తరించిందన్న హెచ్చరికలు వెలువడుతున్నాయి. గట్లను బోల్టులతో బలపర్చాలని, కాంక్రీట్తో రీ-ఎన్ఫోర్స్ చేయాలన్న సూచనలు వచ్చాయి.వాటర్ గేట్ల నిర్వహణలో తక్షణ మార్పులు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా గొయ్యి మరింతగా విస్తరించకుండా నివారించవచ్చు. స్పిల్‌వే పియర్, ఎడమ గట్టు రక్షణ గోడకు మరమ్మతులు చేయకపోతే, ప్రమాదం తప్పదని హెచ్చరికలు వచ్చాయి.

డ్యామ్ ఫౌండేషన్ గ్యాలరీలో సీపేజీ తీవ్రంగా జరుగుతోంది. సీపేజీ ఎక్కువగా ఉన్న బ్లాకులపై కర్టెన్ గ్రౌటింగ్ చేయాలని నిపుణులు స్పష్టం చేశారు. పూడిక తొలగించి డ్రైన్ నీరు బయటికి వెళ్లేలా చర్యలు తీసుకోవాలి.1975-76లో ఏర్పాటైన అప్రాన్ అంతగా ఫలితం ఇవ్వలేదు. 2009లో 25.5 లక్షల క్యూసెక్కుల వరదతో జలాశయంపై భీకర ప్రభావం పడింది. దీంతో రాతిపొరల్లో మార్పులు వచ్చినట్లు అంచనా. ఇప్పుడు మళ్ళీ ఆధునిక సిమ్యూలేషన్ పద్ధతులతో అధ్యయనం అవసరమైంది.

శ్రీశైలం లో ప్రమాదం జరిగినట్లయితే నాగార్జున సాగర్ తో సహా అనేక ప్రాంతాలు ప్రభావితమవుతాయి. కృష్ణ నది ఒడ్డున వందల గ్రామాలు, అమరావతి నగర ప్రణాళిక కూడా ప్రమాదంలో పడుతుంది. కేంద్రం, రాష్ట్రాలు వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.డ్యామ్ రక్షణకు కేంద్రం నిధులు మంజూరు చేయాలి. ప్రాజెక్టు పునరుద్ధరణకు జాతీయ స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేయాలి. ప్రాజెక్టు భద్రతకు సంబంధించి మరింత జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు కోరుతున్నారు.