విమాన శిథిలాల నుంచి డిజిటల్ వీడియో రికార్డర్‌ స్వాధీనం

విమాన శిథిలాల నుంచి డిజిటల్ వీడియో రికార్డర్‌ స్వాధీనం
అహ్మదాబాద్‌లో గురువారం కూలిన ఎయిర్‌ ఇండియా విమానం శిథిలాల నుంచి డిజిటల్ వీడియో రికార్డర్‌ (డీవీఆర్‌) లభించింది. ప్రమాద స్థలానికి చేరుకున్న గుజరాత్‌ యాంటీ టెర్రర్‌ స్క్వాడ్‌ (ఏటీఎస్‌) అధికారులు దీనిని స్వాధీనం చేసుకున్నారు. 

‘ఇది ఒక డీవీఆర్‌. దీనిని మేం శిథిలాల నుంచి స్వాధీనం చేసుకున్నాం. ఫోరెన్సిక్ ల్యాబ్ బృందం ఇక్కడికి వస్తుంది’ అని ఏటీఎస్‌ అధికారి మీడియాతో పేర్కొన్నారు. అయితే విమాన శిథిలాల్లో లభించిన డిజిటల్ వీడియో రికార్డర్‌ (డీవీఆర్‌)ను పరిశీలించిన తర్వాత ఎయిర్‌ ఇండియా విమానం ప్రమాదం గురించి కొంత సమాచారం తెలిసే అవకాశమున్నది.

మరోవైపు విమానంలో అత్యంత కీలకమైన బ్లాక్‌ బాక్స్‌ కోసం వెతుకులాట కొనసాగుతోంది. బ్లాక్‌ బాక్స్‌ దొరికితే ప్రమాద కారణాలు తెలిసే అవకాశం ఉంది. ఘటనా స్థలానికి.. ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీ నిపుణులు కూడా చేరుకొని ఆధారాలు సేకరించనున్నారు. కాగా, ఈ దుర్ఘటనపై దర్యాప్తుకు జాతీయ పరిశోధన సంస్థ (ఎన్ఐఏ) బృందం శుక్రవారం ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలన ప్రారంభించింది.

డీవీఆర్ అనేది విమానంలో భద్రత కోసం ఇన్‌స్టాల్ చేసే ఒక ఎలక్ర్టానిక్ పరికరం. విమానంలో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ అందులో రికార్డు అవుతుంది. విమాన ప్రయాణానికి రూపొందించిన డివిఆర్ సాధారణ డిజిటల్ వీడియో రికార్డర్ కంటే చాలా అధునాతమైనది. ఈ డివైజ్ ఎంత క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో అయినా పని చేస్తుంది. ఈ పరికరం భద్రత, శిక్షణతో పాటు ఇతర అంశాల్లో ఈ డివైజ్ చాలా కీలకంగా పనిచేస్తుంది.

వాయిస్, డేటా రికార్డింగ్‌లు, ఇంజిన్ పనితీరు, ఎత్తు, వాయువేగం, కాక్‌పిట్ సంభాషణలు వంటిని వాటిని డీవీఆర్ నిక్షిప్తం చేస్తుంది. పైలట్ ఏం చేస్తున్నాడు, విమానం నియంత్రణ, కదలికలు, డాష్‌బోర్డ్‌లోని హెచ్చరిక లైట్లు, విమానం ప్రయాణించే వాతావరణం వంటివి ఇది రికార్డు చేస్తుంది. ఒకవేళ పైలెట్ పరధ్యానంలో ఉన్నా కూడా ఇది పసిగట్టగలదు.