తెలంగాణ కాంగ్రెస్‌లో చిచ్చు రాజేసిన మంత్రివర్గ విస్తరణ

తెలంగాణ కాంగ్రెస్‌లో చిచ్చు రాజేసిన మంత్రివర్గ విస్తరణ
తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రివర్గ విస్తరణ చిచ్చు రాజేసింది. మంత్రి పదవి ఆశించి భంగపడ్డ సీనియర్ నేతలు ఇంకా అలక వీడలేదు. అసంతృప్తి ఎమ్మెల్యేలను బుజ్జగించడానికి సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మంత్రులు, ఉప ముఖ్యమంత్రి  భట్టి విక్రమార్క రంగంలోకి దిగినా ఫలితం కనిపించడం లేదు. మల్‌రెడ్డి రంగారెడ్డిని మంత్రి శ్రీధర్‌బాబు కలవగా ప్రేమ్‌సాగ ర్ రావును  భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ కలిశారు.
వీరితో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిలు సోమవారం ఎవరిని కలవడానికి ఇష్టపడలేదని వారిని బుజ్జగించడానికి ప్రయత్నించిన మంత్రులు, కాం గ్రెస్ సీనియర్ నాయకులకు వారు అందుబాటులోకి రాలేదని తెలిసింది. మంత్రివర్గంలో స్థానంపై గంపెడాశలు పెట్టుకున్న సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, మల్ రెడ్డి రంగారెడ్డి, రాజగోపాల్ రెడ్డిలు అధిష్ఠానం నిర్ణయం తో షాక్‌కు గురయినట్టుగా సమాచారం.

మొదటిరోజు అసంతృప్తులతో మీనాక్షి నటరాజన్, మహేశ్ కుమార్ గౌడ్ బుజ్జగింపులు చేసినా, పెండింగ్‌లో మరోమారు జరిగే విస్తరణలో తప్పక అవకాశం ఉంటుందని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నా వారు తమ అలక వీడటం లేదని తెలిసింది. తాజా పరిణమాలు మింగుడుపడని అసంతృప్త నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ప్రస్తుతం అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన వివేక్‌కు మంత్రి పదవి ఇవ్వగా మంత్రి పదవి ఇస్తామన్న షరతుతోనే పార్టీలో చేరిన తనకు ఆ పోస్టు ఇవ్వకపోవడంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

ఇక తన జిల్లాకు అన్యాయం చేస్తే ఊరుకునేదే లేదని, మంత్రి వర్గంలో తన జిల్లా వాళ్లకు చోటు కల్పించాల్సిదేనని మల్ రెడ్డి రంగారెడ్డి పట్టుబడుతున్నారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి మంత్రివర్గ విస్తరణకు సంబంధించి  మీడియాతో మాట్లాడుతూ ఏళ్లుగా పార్టీ జెండానే నమ్ముకుని పనిచేస్తున్న వాళ్లకు పదవులు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. కొత్తగా పార్టీలోకి వచ్చని వాళ్లకు పదవులు ఇచ్చుకుంటూ పోతే పార్టీలో ఉన్న నాయకులు, కార్యకర్తల విశ్వసనీయత దెబ్బతింటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తాజాగా జరిగిన రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో నిజామాబాద్, కామారెడ్డి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించకపోవడంతో స్థానిక నేతల్లో అలజడి మొదలైంది. మాజీమంత్రి, బోధన్ ఎంఎల్‌ఎ సుదర్శన్ రెడ్డి అనుచరులు నియోజకవర్గంలో రాజీనామాలకు సిద్ధమయ్యారు. ఇప్పటికీ పార్టీకి, పలు పదవులకు రాజీనామాలు చేస్తున్నట్లు నేతలు ప్రకటించారు. ఎంఎల్‌ఎ సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి దక్కకపోవడంతో నిరాశలో ఉన్న కాంగ్రెస్ నాయకులు అధిష్టానం తీరును నిరసిస్తూ మంగళవారం బోధన్ బందుకు పిలుపునిచ్చారు. కానీ ఆ వెనువెంటనే బంద్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు.