తెలంగాణ మంత్రులుగా ముగ్గురు ప్రమాణస్వీకారం

తెలంగాణ మంత్రులుగా ముగ్గురు ప్రమాణస్వీకారం
 
తెలంగాణలో కేబినెట్ విస్తరణ జరిగింది. రాజ్ భవన్ లో నూతన మంత్రులతో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రులుగా జి.వివేక్ వెంటకస్వామి, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త మంత్రులకు గవర్నర్, సీఎం రేవంత్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి వివేక్ (మాల), అడ్లూరి లక్ష్మణ్ (మాదిగ), బీసీ సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరి (ముదిరాజ్)కు మంత్రివర్గంలో చోటు కల్పించారు.

నూతన మంత్రులకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్శుభాకాంక్షలు తెలిపారు. శాసనసభ ఉపసభాపతిగా రామచంద్రనాయక్కు అవకాశం లభించగా, సీఎం రేవంత్ శుభాకాంక్షలు తెలియజేశారు. సామాజిక న్యాయాన్ని పరిగణనలోకి తీసుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. ఆ వర్గానికి చెందిన వారినే మంత్రివర్గంలోకి తీసుకున్నారు. తాజాగా పదవులు పొందినవారంతా మొదటిసారి ఎమ్యెలుగా ఎన్నికైన వారు కావడం గమనార్హం.

బీసీ సామాజిక వర్గానికి చెందిన శ్రీహరి ముదిరాజ్‌, ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన గడ్డం వివేక్‌, మాదిగ సామాజిక వర్గానికి చెందిన అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌కు అవకాశం దక్కింది. లంబాడా సామాజిక వర్గం నుంచి రామచంద్రు నాయక్‌ను ఉపసభాపతిగా ఎంపిక చేశారు. విస్తరణలో నలుగురికి అవకాశం కల్పించాలని తొలుత భావించారు. సుదర్శన్‌ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిల పేర్లు మొదటి నుంచీ వినిపించినా, ప్రస్తుతానికి ఎస్సీ, బీసీలకు మాత్రమే అధిష్ఠానం అవకాశం ఇచ్చింది.

అయితే మాదిగ సామాజికవర్గంతో పాటు ఎస్టీల నుంచి కూడా ఒకరికి అవకాశం ఇవ్వాలని నిజామాబాద్‌ జిల్లా నుంచి సుదర్శన్‌రెడ్డికి కూడా చోటు కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పట్టుబట్టినట్లు సమాచారం. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి అవకాశం ఇస్తే ఆయన సోదరుడు, మంత్రి వెంకట్‌ రెడ్డిని కూడా కొనసాగించడం కష్టమని, ఇద్దరిలో ఒకరికి మాత్రమే చోటు కల్పించాల్సి ఉంటుందని అధిష్ఠానం స్పష్టం చేయడంతో ఈ అంశాన్ని ప్రస్తుతానికి పక్కనపెట్టినట్లు తెలిసింది. ప్రస్తుతం ముగ్గురికి అవకాశం కల్పించడంతో మరో 3 స్థానాలు ఖాళీగా ఉంటాయి. వీటితో పాటు చీఫ్‌ విప్‌ పదవి భర్తీకి కూడా కసరత్తు సాగుతోంది. బీసీల నుంచి ఆది శ్రీనివాస్‌ ప్రస్తుతం శాసనసభలో విప్‌గా ఉన్నారు.