‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంలో మరో కీలక ముందడుగు పడింది. భారత వైమానిక దళానికి వెన్నెముకగా నిలుస్తున్న రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించిన విడిభాగాల ఉత్పత్తి ఇకపై భారత్లోనే తయారు చేయనున్నారు. ఇందుకు హైదరాబాద్ కేంద్రంగా నిలవడం విశేషం. ఈ మేరకు ఫ్రాన్స్కు చెందిన రఫేల్ మాతృ సంస్థ డసో ఏవియేషన్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ (టీఏఎస్ఎల్) మధ్య కీలక ఒప్పందం కుదిరింది.
ఈ ఒప్పందం ప్రకారం ఇకపై రఫేల్ యుద్ధవిమానాలకు చెందిన ప్రధాన భాగాలు హైదరాబాద్లోని టీఏఎస్ఎల్ లో తయారవుతాయి. రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్ విడిభాగాలు ఫ్రాన్స్ వెలుపల తయారు కావడం ఇదే తొలిసారి. యుద్ధ విమానాల తయారీలో మరింత వేగం పెంచేందుకు ఈ ఒప్పందం దోహదపడనుంది 2028 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ విడిభాగాల ఉత్పత్తిని ప్రారంభించాలని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లక్ష్యంగా పెట్టుకుంది.
ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లను సంస్థ వేగవంతం చేయనుంది. నెలకు రెండు ఫ్యూజ్లేజ్లను అందించనుంది. భారత రక్షణ రంగ చరిత్రలో ఈ ఒప్పందం ఓ మైలురాయిగా నిలుస్తుందని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెట్ సీఎండీ సుకరన్ సింగ్ తెలిపారు. భారతదేశ వైమానిక వ్యవస్థ అభివృద్ధి, పురోగతిని ఈ ఒప్పందం ప్రతిబింబిస్తుందని చెప్పారు. ఇప్పటికే టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఎయిర్ బస్, బోయింగ్ కంపెనీల విడి భాగాలు తయారు చేస్తోంది.
మరోవైపు ఈ ఒప్పందంపై డసో ఏవియేషన్ ఛైర్మన్ అండ్ సీఈఓ ఎరిక్ ట్రాపియర్ మాట్లాడుతూ “భారత్లో మా ఉత్పత్తిని బలోపేతం చేయడంలో ఇది కీలక అడుగు. భారత రక్షణ రంగంలో మా సేవలను విస్తరిస్తున్నందుకు ధన్యవాదాలు. ఈ నిర్ణయం రఫేల్ విస్తరణకు మరింత దోహదం చేస్తుంది. అంతేకాదు, నాణ్యమైన సేవలు అందిస్తూ సైనిక అవసరాలను తీర్చేందుకు ఉపయోగపడుతుంది” అని పేర్కొన్నారు.
మరోవైపు యుద్ధ విమానాల తయారీ దిశగా హైదరాబాద్ పరిశ్రమలు ముందడుగు వేశాయి. తేజస్ మార్క్-1ఏలో 5 భాగాలు ఉంటే అందులో మధ్య భాగాన్ని హైదరాబాద్ నగరంలోని వెమ్ టెక్నాలజీస్ డెవలప్ చేసింది. ప్రస్తుతం మరింత అధునాతన తేజస్ మార్క్-1ఏ కి మధ్య భాగాన్ని సిద్ధం చేశారు. మొదటి ఉత్పత్తిని మే 30న హెచ్ఏఎల్కు అందజేశారు.

More Stories
నేడు తాండూరు నుంచి ‘రైతు గోస-బిజెపి భరోసా’
పాకిస్తాన్ ఉగ్రవాదులతో లింక్.. మేడ్చల్లో ఓ యువకుడి అరెస్ట్
కృత్రిమ మేధను విస్తృతంగా ఉపయోగించనున్న తెలంగాణ పోలీస్