జవాన్ పూర్ణం కుమార్ ను చిత్రహింసలకు గురిచేసిన పాక్

జవాన్ పూర్ణం కుమార్ ను చిత్రహింసలకు గురిచేసిన పాక్

పంజాబ్ సమీపంలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద పొరపాటున పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించిన భారత సరిహద్దు భద్రతా దళానికి (బీఎస్ఎఫ్) చెందిన జవాన్ పూర్ణమ్ కుమార్ షా పాక్ సైనికుల చేతిలో చిత్రహింసలకు గురైన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. 21 రోజుల పాటు పాక్ నిర్బంధంలో ఉన్న ఆయనను ఎట్టకేలకు భారత అధికారులకు అప్పగించారు.

పాకిస్థాన్ అధికారులు జవాన్ కుమార్ షాను అదుపులోకి తీసుకున్న తర్వాత అత్యంత దారుణంగా వ్యవహరించినట్లు ఆర్మీ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.. నిర్బంధంలో ఉన్నన్ని రోజులు ఆయన కళ్లకు గంతలు కట్టి ఉంచారని, నిద్ర పోనివ్వకుండా తీవ్రంగా ఇబ్బంది పెట్టారని తెలిపింది. అంతేకాకుండా పాక్ అధికారులు ఆయనను తరచూ మాటలతో దూషిస్తూ, మానసికంగా వేధించినట్లు పేర్కొంది. అలాగే మ‌న దేశ ర‌హ‌స్యాల కోసం అత‌డిపై ప‌లు రకాలుగా వ‌త్తిళ్లు తెచ్చార‌ని పేర్కొంది. అలాగే పూర్ణ‌మ్ కుమార్ ను హింసించిన వారంతా సివిల్ డ్ర‌స్ లో ఉన్నార‌ని కూడా వెల్ల‌డించింది. 

బందీగా చిక్కిన సైనికుడు ప‌ట్ట పాక్ అమానుషంగా ప్ర‌వ‌ర్తించింద‌ని, దీనిపై పాక్ ను ప్ర‌శ్నిస్తామ‌ని ఆర్మీ స్పష్టం చేసింది. సాధారణంగా యుద్ధ ఖైదీల విషయంలో కూడా అంతర్జాతీయ నిబంధనలను పాటించాల్సి ఉండగా పొరపాటున సరిహద్దు దాటిన జవాన్‌ పట్ల ఇంతటి కఠినంగా ప్రవర్తించడం గమనార్హం. ఈ ఘటనపై ఉన్నతాధికారులు త‌దుప‌రి చ‌ర్య‌ల‌కు సిద్ద‌మ‌వుతున్నారు. 

పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో విధులు నిర్వహిస్తున్న 40 ఏళ్ల పూర్ణం కుమార్‌ షా జమ్ము కశ్మీరులోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన మరుసటి రోజున పొరపాటున సరిహద్దును దాటి పాకిస్థాన్‌ సరిహద్దుల్లోకి ప్రవేశించారు. అప్పటి నుంచి అతడి విడుదలపై భారత అధికారులు పాక్‌తో సంప్రదింపులు జరుపుతూ వచ్చారు. అయితే, పహల్గాం ఘటనతో పూర్ణం కుమార్‌ షా అప్పగింత ఆలస్యమైంది. అప్పటి నుంచి పాక్‌ సైనికుల నిర్బంధంలోనే మగ్గిపోయిన పూర్ణం షా ఎట్టకేలకు 21 రోజుల తర్వాత భారత్‌కు సురక్షితంగా తిరిగి వచ్చారు.