బాధ్యతలేని, దుష్ట పాకిస్థాన్ వద్ద అణ్వాయుధాలు ఉండడం ఎంత వరకు క్షేమం అని ప్రపంచ దేశాల్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రశ్నించారు. శ్రీనగర్లోని బాదామి బాగ్ కంటోన్మెంట్లో గురువారం ఆయన మాట్లాడారు. బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న పాకిస్థాన్ వద్ద న్యూక్లియర్ ఆయుధాలు ఉండడం ఎంత వరకు సమంజసం అని రాజ్నాథ్ అడిగారు. అంతర్జాతీయ అణు ఇంధన ఏజెన్సీ పాకిస్థాన్ అణ్వాయుధాలను తన ఆధీనంలోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆపరేషన్ సింధూర్ సమయంలో జరిగిన దాడిలో కిరానా హిల్స్ సమీపంలోని నూర్ఖాన్ ఎయిర్బేస్ను భారతీయ వైమానిక దళాలు దాడి చేశాయి. అయితే ఆ ఎయిర్బేస్ వద్ద న్యూక్లియర్ వార్హెడ్స్ను పాకిస్థాన్ దాచిపెట్టినట్లు తెలుస్తోంది. దాడి జరగడం వల్ల ఆ న్యూక్లియర్ వార్హెడ్స్ నుంచి అణుధార్మికత రిలీజ్ అవుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. పాకిస్థాన్ అణు బెదిరింపులకు బెదిరేది లేదని భారత్ స్పష్టం చేసిందని పేర్కొంటూ పాకిస్థాన్లో అణ్వాయుధాల భద్రతపై అనుమానం ఉందన్న ఆయన, వాటిపై అంతర్జాతీయ సంస్థల నిఘా అవసరమని తెలిపారు.
ఆదేశ పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాలను కచ్చితత్వంతో ధ్వంసం చేసి ముష్కరమూకలకు భారత్ తగిన గుణపాఠం చెప్పిందని రాజ్నాథ్ వ్యాఖ్యానించారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి రక్షణమంత్రి జమ్మూకశ్మీర్లో పర్యటించారు. అమరులైన సైనికులకు రాజ్నాథ్సింగ్ శ్రీనగర్లో నివాళులర్పించారు. పెహల్గామ్ దాడి తర్వాత జమ్మూకశ్మీర్ ప్రజల్లో పాకిస్థాన్, ఉగ్రవాదులపై ఆగ్రహం వ్యక్తం అయ్యిందని, జమ్మూకశ్మీర్ ప్రజలకు సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు.
శుత్రవులను నాశనం చేసిన శక్తి ఇక్కడ ఉందని, పాకిస్థానీ చౌకీలు, బంకర్లను ధ్వంసం చేసిన తీరుతో శత్రుదేశం షాక్కు గురైందని పేర్కొన్నారు. కిష్టమైన పరిస్థితుల్లో ఇక్కడ మీతో ఉండడం గర్వంగా భావిస్తున్నానని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో మీరు చేసిన పని పట్ల దేశం గర్వంగా ఉందని పేర్కొంటూ రక్షణ మంత్రి కన్నా ముందు తాను దేశ పౌరుడినని, ఓ మంత్రిగానే కాకుండా, ఓ పౌరుడిగా ధన్యవాదాలు చెబుతున్నట్లు రాజ్నాథ్ తెలిపారు.
సైనిక బలగాలతో ముచ్చటించిన రక్షణమంత్రి, ఆపరేషన్ సిందూర్ విజయంపై సైన్యాన్ని ప్రశంసించారు. సైనిక ఉన్నతాధికారులను కలిసి భద్రతా పరిస్థితిని, సాయుధ దళాల పోరాట సంసిద్ధతను సమీక్షించారు. బాదామీ బాఘ్ కంటోన్మెంట్ వద్ద జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో కలిసి భారత్ తుక్కుచేసిన పాక్ డ్రోన్లు, క్షిపణుల శకలాలను పరిశీలించారు
పహల్గాంలో మతం అడిగి మరీ పర్యటకులను చంపారనీ తద్వారా దేశ ప్రజలను విడదీయాలని చూశారని రక్షణ మంత్రి తెలిపారు. ముష్కరుల దుశ్చర్యలకు ఆపరేషన్ సిందూర్తో ఉగ్రస్థావరాలపై దాడులు చేసి వారిని తుదముట్టించిన భారత సైనికుల పరాక్రమాన్ని ప్రపంచమంతా చూసిందని ప్రశంసించారు. ఇకపై ఉగ్ర దాడులను దేశంపై యుద్ధంగానే పరిగణిస్తామని ప్రధాని మోదీ చెప్పారన్న రక్షణమంత్రి, మనం దాడి చేసిన తీరును శత్రువు ఎప్పటికీ మరువడని స్పష్టం చేశారు.
“పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ ఉగ్రవాదులపై తమ కోపాన్ని వ్యక్తం చేసిన జమ్ముకశ్మీర్ ప్రజలకు కూడా నేను సెల్యూట్ చేస్తున్నాను. శత్రువులను నాశనం చేసిన శక్తిని అనుభూతి చెందేందుకు నేను ఇక్కడకు వచ్చాను. సరిహద్దు వెంబడి పాకిస్తాన్ చౌకీలు, బంకర్లను మీరు నాశనం చేసిన విధానాన్ని శత్రువు ఎప్పటికీ మరచిపోలేడు” అని తెలిపారు.
“పాకిస్థాన్ అణు బెదిరింపులకు భారత్ భయపడదు. భారత్పై అణు దాడి చేస్తామంటూ పాకిస్థాన్ చేసిన బెదిరింపులను యావత్ ప్రపంచం అనేకసార్లు చూసింది. ఇప్పుడు శ్రీనగర్ సాక్షిగా నేను ప్రపంచాన్ని అడగాలనుకుంటున్నాను. ఒక బాధ్యతారహితమైన దుర్మార్గపు దేశపు చేతుల్లో అణ్వాయుధాలు సురక్షితంగా ఉంటాయా ?” అని రాజ్నాథ్ ప్రశ్నించారు. బాదామీ బాఘ్ కంటోన్మెంట్ వద్ద సైనికులతో కలిసి రాజ్నాథ్సింగ్, ఒమర్ అబ్దుల్లా, మనోజ్ సిన్హా భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.
More Stories
భారత్ `విశ్వగురువు’గా మారడమే ప్రపంచ శాంతికి మార్గం
మంత్రివర్గం అనుమతి లేదంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా
కేరళ రాజ్భవన్ లో భారత మాత ఫొటోతో మంత్రులు వాకౌట్