రూ. 3706 కోట్ల‌తో యుపిలో సెమీకండ‌క్ట‌ర్ యూనిట్‌

రూ. 3706 కోట్ల‌తో యుపిలో సెమీకండ‌క్ట‌ర్ యూనిట్‌
దేశంలో మ‌రో సెమీకండ‌క్ట‌ర్ల త‌యారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయ‌నున్నారు. బుధ‌వారం కేంద్ర క్యాబినెట్ ఆ యూనిట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని జేవ‌ర్‌లో సుమారు 3706 కోట్ల ఖ‌ర్చుతో ఆ సెమీకండ‌క్ట‌ర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. హెచ్‌సీఎల్‌- ఫాక్స్‌కాన్ కంపెనీ సెమీకండ‌క్ట‌ర్ ఉత్ప‌త్తి కేంద్రాన్ని ప్రారంభించ‌నున్న‌ది.
 
మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఆటోమొబైల్స్‌, ఇత‌ర డివైస్‌ల‌కు కావాల్సిన డిస్‌ప్లే డ్రైవ‌ర్ చిప్స్‌ను అక్క‌డ త‌యారు చేయ‌నున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్ తెలిపారు. కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణ‌యాల‌ను ఆయ‌న మీడియాకు వెల్ల‌డించారు. నెల‌కు సుమారు 20 వేల వాఫ‌ర్ల‌ను ప్రాసెస్ చేయ‌నున్నారు. ఈ కంపెనీ ద్వారా సుమారు రెండు వేల ఉద్యోగాలు క‌ల్పించ‌నున్నారు.దేశంలో ఇప్ప‌టికే అయిదు సెమీకండ‌క్ట‌ర్ యూనిట్లు నిర్మాణంలో ఉన్నాయి. ప్ర‌స్తుతం ఆరో కంపెనీకి శ్రీకారం చుట్టున్నారు. హెచ్‌సీఎల్‌, ఫాక్స్‌కాన్ కంపెనీలు సంయుక్తంగా సెమీకండ‌క్ట‌ర్ల ఉత్ప‌త్తి చేయ‌నున్నాయి. హార్డ్‌వేర్ ఉత్ప‌త్తి, అభివృద్ధిలో హెచ్‌సీఎల్‌కు సుదీర్ఘ చ‌రిత్ర ఉంది. 

ఇక ఎల‌క్ట్రానిక్స్ ఉత్ప‌త్తిలో ఫాక్స్‌కాన్ కూడా ప్ర‌పంచ మేటి సంస్థే. య‌మునా ఎక్స్‌ప్రెస్‌వే ఇండ‌స్ట్రియ‌ల్ డెవ‌ల‌ప్మెంట్ అథారిటీ స‌మీపంలో ఉన్న జీవార్ విమానాశ్ర‌యం వ‌ద్ద కొత్త కంపెనీ ఏర్పాటు చేయ‌నున్నారు. అత్యంత అధునాతన సాంకేతికత ఈ ప్లాంట్ ప్రత్యేకత. ప్రామాణిక నాణ్యమైన రీతిలో సెల్ ఫోన్లు, కంప్యూటర్లు, లాప్‌టాప్‌లలో సరైన రీతిలో స్పష్టంగా కాంటెంట్ కనబడటానికి వీలుంటుంది. 

దీని వల్ల సదరు వస్తువులకు గిరాకీ కూడా పెరుగుతందని మంత్రి చెప్పారు. ఫ్యాక్స్‌కాన్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీలో మంచి పేరుంది. అతి పెద్ద తయారీ సంస్థగా ఉంటూ ఇప్పటికే యాపిల్ ఐ ఫోన్లను కూడా సిద్ధం చేస్తోంది. ఇక్కడ ఈ ఫ్యాక్టరీ నెలకొనడం జరిగితే డిస్‌పే ప్యానెల్ పాంట్ పూర్తి స్థాయిలో భారత్‌కు తరలివచ్చినట్లే అవుతుంది. ఇక్కడి ఉత్పత్తి 2027 నాటికి ఆరంభమవుతుంది. దాదాపు రెండు వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తుంది.