పాక్ నిధులకు కోత పెట్టమని ఏడీబీని కోరిన ఆర్థిక మంత్రి నిర్మల

పాక్ నిధులకు కోత పెట్టమని ఏడీబీని కోరిన ఆర్థిక మంత్రి నిర్మల

పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా పాకిస్తాన్‌పై భారత్ అన్ని రకాల చర్యలను చేపడుతోంది. దాని ఆర్థిక మూలాలను దెబ్బతీసే ప్రయత్నాలను భారత సర్కారు వేగవంతంగా చేసింది. ఈక్రమంలోనే ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఎడిబి) అధ్యక్షుడు మసాతో కందాతో భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశమయ్యారు.  ఉగ్రవాద కార్యకలాపాలకు వేదికగా మారిన పాకిస్తాన్‌కు నిధుల కేటాయింపును తగ్గించాలని ఆమె కోరారు.

ఆర్ధిక శాఖ అధికారులతో కలిసి ఆమె ఇటలీలో జరిగిన ఎడిబి 56వ డైరెక్టర్ల వార్షిక సమావేశంలో ఆమె పాల్గొంటూ ఈ అంశాన్ని ప్రస్తావించారు. పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యం నుంచి ఉగ్రవాద సంస్థలకు నిధులు మళ్లుతున్నాయని నిర్మల పేర్కొన్నారు. ఫలితంగా ఉగ్రవాదం వ్యాప్తి జరుగుతోందని ఆమె తెలిపారు.  ఇటలీ ఆర్థిక మంత్రి గియాన్‌కార్లో జియోర్ గెట్టితో జరిగిన భేటీలోనూ ఇదే అంశాన్ని నిర్మలా సీతారామన్ ప్రస్తావించారని అధికార వర్గాలు తెలిపాయి.

ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) గ్రే లిస్టులో మళ్లీ పాక్‌ను చేర్చాలని ఆమె కోరారని పేర్కొన్నాయి.  తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ ప్రస్తుతం ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఎడిబి), అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి రోజులు వెళ్లదీస్తోంది. వివిధ రంగాల అభ్యున్నతి కోసమని చెబుతూ ఈ సంస్థల నుంచి పాకిస్తాన్‌ అప్పులు తీసుకుంటోంది.

2024 జులైలో మూడేళ్ల కాల వ్యవధి కోసం రూ.59 వేల కోట్ల (7  బిలియన్ డాలర్ల) రుణ ప్యాకేజీని పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్ మంజూరు చేసింది. దీనిపైనా ఐఎంఎఫ్ ఎదుట ఆందోళన వ్యక్తం చేయాలని భారత సర్కారు యోచిస్తోంది. ఎఫ్‌ఏటీఎఫ్ గ్రే లిస్టులో మళ్లీ పాకిస్తాన్‌ను చేర్చాలని ఐరోపా దేశాలను భారత్ బలంగా డిమాండ్ చేస్తోంది.  అందుకు అనుకూలంగా నిర్ణయం వెలువడితే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టం కలుగుతుంది.

ఆ దేశం అంతర్జాతీయ సంబంధాలు దెబ్బతింటాయి. అంతర్జాతీయ స్థాయిలో పాకిస్తాన్ ఆర్థిక ప్రతిష్ఠ దెబ్బతింటుంది. పాకిస్తాన్‌కు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అందించే నిధుల వినియోగంలో పారదర్శకత అవసరమని భారత్ వాదిస్తోంది.  తద్వారా పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలకు నిధులు చేరకుండా నిలువరించొచ్చని భారత సర్కారు సూచిస్తోంది. దీనివల్ల ప్రాంతీయ సుస్థిరత సాధ్యమవుతుందని అంటోంది.