మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదు

మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదు
మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ స్పష్టం చేశారు. ఆపరేషన్‌ కగార్‌ ఆగదని, మావోయిస్టులు ఆయుధాలు వీడాల్సిందేనని, లొంగిపోవాల్సిందేనని తేల్చిచెప్పారు. తుపాకీతో అమాయకులను చంపేవారితో చర్చలు ఉండవని, నిషేధిత సంస్థలతో తాము చర్చలు జరపమని స్పష్టం చేశారు.  సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌లు పోటీ పడి మరి నక్సలైట్లను సపోర్ట్ చేస్తున్నారని విస్మయం వ్యక్తం చేశారు.
పోలీసులను, రిపోర్టర్లను చంపితే వారెందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. నక్సల్‌ హింసలో ఎందరో నాయకులు, పోలీసులు, అమాయక గిరిజనులు చనిపోయారని చెప్పారు. పైగా, మావోయిస్టులపై నిషేధం విధించిందే కాంగ్రెస్‌ పార్టీయేనని సంజయ్ గుర్తు చేశారు.  కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీ సహా ఎంతో మంది నాయకులను మందుపాతరలు పెట్టి చంపారని తెలిపారు.
అమాయక గిరిజనులను ఇన్‌ఫార్మర్ల నెపంతో అన్యాయంగా కాల్చిచంపి ఎన్నో కుటుంబాలకు మానసిక క్షోభ మిగిల్చారని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల తుపాకీ వీడనంత వరకు వారితో చర్చల ఊసే ఉండదని సంజయ్ స్పష్టం చేశారు. కాగా, పహాల్గాం సమస్యను శాంతి భద్రతల కోణంలో చూడాలని చెబుతూ హిందూ ముస్లిం కోణంలో అసలు చూడొద్దని బండి సంజయ్ హితవు చెప్పారు. 
పాస్‌పోర్టు లేని విదేశీయులను గుర్తించి పంపిస్తున్నామన్నారుని చెబుతూ పాకిస్థాన్‌ పౌరులను గుర్తించి వెనక్కి పంపే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని, వారు కేంద్రంతో సహకరించాలని కోరారు.  రోహింగ్యాలపై కాంగ్రెస్‌ తన వైఖరి ఏమిటో చెప్పాలని సంజయ్ డిమాండ్‌ చేశారు. శాంతి భద్రతల సమస్యను రాజకీయం చేయడం సరికాదని సూచించారు. కేంద్ర ప్రభుత్వ కులగణన నిర్ణయం చారిత్రాత్మకమని పేర్కొంటూ దానిని కాంగ్రెస్‌ విజయంగా చెప్పుకోవడం విడ్డూరమని విమర్శించారు.
కాంగ్రెస్‌ కులగణన సర్వేకు, మోదీ కులగణనకు పొంతనే ఉండదని వెల్లడించారు.  కాంగ్రెస్‌ కులగణనతో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని, బీసీల జనాభాను తగ్గించి చూపారని సంజయ్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ మాయమాటలను జనం నమ్మడం లేదని, ఆరు గ్యారంటీల అమలులో వైఫల్యాన్ని పక్కదోవ పట్టించేందుకే ఆ పార్టీ డ్రామాలడుతున్నదని ఆయన విమర్శించారు.