ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమిస్తామంటూ బంగ్లా నేత అవాకులు!

ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమిస్తామంటూ బంగ్లా నేత అవాకులు!
 
* భారత్‌కు పాక్‌ దౌత్య నోటీసు!

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్​- భారత్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న క్రమంలో  పాకిస్థాన్​పై భారత్‌ దాడి చేస్తే ఆ దేశానికి చెందిన ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకుంటామని సైన్యానికి చెందిన విశ్రాంత మేజర్‌ జనరల్‌ ఏఎల్‌ఎం ఫజ్లుర్‌ రహ్మాన్‌ రెచ్చగొట్టే వాఖ్యలు చేశారు. అది కూడా చైనా సాయంతో ఏడు ఈశాన్య రాష్ట్రాలను స్వాధీనం చేసుకోవాలని ఫేస్​బుక్​లో పోస్ట్ చేశారు.

“పాక్​పై భారత్​ దాడి చేస్తే, ఆ దేశంలోని 7 ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్ ఆక్రమించుకోవాలి. అందుకోసం సంయుక్త సైనిక ఏర్పాట్లపై చైనాతో చర్చలు జరపాల్సిన అవసరం చాలా ఉంది” అని ఫజ్లుర్ రహ్మాన్ బెంగాలీలో రాశారు. అయితే, ఈ వ్యాఖ్యలతో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని బంగ్లాదేశ్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం శుక్రవారం స్పష్టం చేసింది. 

ఇటువంటి వాటిని ప్రోత్సహించమని స్పష్టం చేసింది. అయితే, వ్యక్తిగత అభిప్రాయాలను ప్రభుత్వంతో ముడిపెట్టవద్దని పేర్కొంది. పొరుగుదేశాలతో శాంతియుత సంబంధాలను కొనసాగించాలనే ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు మహ్మద్‌ యూనస్‌కు రహ్మాన్‌ అత్యంత సన్నిహితుడు కావడం గమనార్హం.

మరోవంక, పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్ సింధూ జలాల ఒప్పందం అమలును నిలిపివేసింది. దీనిని నిరసిస్తూ డిల్లీకి లాంఛనంగా దౌత్య నోటీసు ఇవ్వాలని పాకిస్థాన్‌ యోచిస్తోంది. పాక్‌ విదేశీ, న్యాయ, జలవనరుల మంత్రిత్వశాఖల మధ్య జరిగిన ప్రాథమిక చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.  ఇప్పటికే తమ గగనతలంలో భారత్‌కు చెందిన విమానాలకు అనుమతిని నిలిపేసింది పాకిస్థాన్. దీనిపై భారత్‌ కూడా దీటుగా స్పందించింది. పాక్‌ విమానయాన సంస్థలకు మన గగనతలాన్ని తాజాగా మూసివేసింది.
పాకిస్థాన్‌ తన గగనతలాన్ని మూసివేసిన కారణంగా కేవలం ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ మాత్రమే కాకుండా .అనేక దేశాలకు చెందిన ఎయిర్‌లైన్స్‌లు కూడా. తమపై నిషేధం లేనప్పటికీ అవి పాక్‌ గగనతలాన్ని స్వచ్ఛందంగా దూరం పెట్టడం గమనార్హం.  చివరకు భారత్‌పై ప్రతీకారం తీర్చుకుంటున్నామనుకుని భ్రమపడి పాకిస్థాన్‌ తీవ్రమైన ఆర్థిక నష్టాన్ని చవిచూస్తోంది. 
తన గగనతలాన్ని ఉపయోగించుకున్నందుకు ఎయిర్‌లైన్స్‌ల నుంచి ఓవర్‌ఫ్లైట్‌ ఫీజుల పేరిట ప్రతి నెలా లక్షల డాలర్లు వసూలు చేస్తున్న పాకిస్థాన్‌ ఏరోస్పేస్‌ సంస్థ ఇప్పుడా ఆదాయాన్ని పూర్తిగా కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. గత రెండు రోజులుగా లుఫ్తాన్సా, బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌, స్విస్‌, ఎయిర్‌ ఫ్రాన్స్‌, ఇటలీకి చెందిన ఐటీఏ, పోలాండ్‌ లాట్‌ వంటి ప్రముఖ యూరోపియన్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థలు స్వచ్ఛందంగా పాకిస్థాన్‌ గగనతలాన్ని వాడుకోవడం మానేశాయి.