క్షిపణి పరీక్షలతో పాక్ కవ్వింపు… భగ్గుమన్న భారత్

క్షిపణి పరీక్షలతో పాక్ కవ్వింపు… భగ్గుమన్న భారత్
పహల్గాం ఉగ్రదాడి తర్వాతి నుంచి సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒపందాన్ని ఉల్లంఘిస్తూ వస్తున్న పాకిస్థాన్ సైన్యం కవ్వింపు చర్యలను మరింత తీవ్రతరం చేసింది. ఈ క్రమంలోనే అబ్దాలీ వెపన్ సిస్టమ్ అనే బాలిస్టిక్ క్షిపణిని శనివారం పరీక్షించింది. 450 కిలోమీటర్ల రేంజ్ కలిగిన ఈ క్షిపణి పరీక్ష విజయవంతం అయిందని పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. భూతలం నుంచి భూతలంలోని లక్ష్యాలను ఈ మిస్సైల్ ఛేదించగలదని వెల్లడించింది.

‘ఇండస్’ పేరుతో నిర్వహిస్తున్న సైనిక విన్యాసాల్లో భాగంగా ఈ క్షిపణిని పరీక్షించామని పాక్ తెలిపింది. “భద్రతా బలగాల సన్నద్ధత, సాంకేతిక ప్రమాణాల తనిఖీకి సంబంధించిన చర్యల్లో భాగంగానే ఈ క్షిపణిని పరీక్షించాం. మిస్సైల్‌‌లోని అత్యాధునిక నేవిగేషన్ వ్యవస్థ, లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యాన్ని పరీక్షించాాం” అని పాకిస్థాన్ ప్రభుత్వం వెల్లడించింది.  “దేశపు జాతీయ భద్రతను పరిరక్షించే స్థాయిలో సైన్యం సన్నద్ధతను, సాయుధ సామర్థ్యాలను కలిగి ఉందని ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, త్రివిధ దళాల అధిపతులు పూర్తి విశ్వాసాన్ని వెలిబుచ్చారు” అని పాక్ ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

అబ్దాలీ వెపన్ సిస్టమ్‌ను పాకిస్థాన్ పరీక్షించడాన్ని తీవ్రమైన కవ్వింపు చర్యగా పరిగణిస్తున్నామని భారత సైనిక వర్గాలు పేర్కొన్నాయి. పాకిస్థాన్ అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ ప్రమాదకర రీతిలో ఉద్రిక్తతలను పెంచుతోందని తెలిపాయి. భారత్‌తో సైనిక ఉద్రిక్తతలను పెంచుకోవాలనే దురుద్దేశం పాకిస్థాన్‌లో స్పష్టంగా కనిపిస్తోందని రక్షణరంగ పరిశీలకులు అంటున్నారు. 

అరేబియా సముద్రంలోనూ భారత్‌తో ఉద్రిక్తతలను పెంచుకునేలా పాక్ నౌకాదళం కవ్వింపులకు దిగుతోందని భారత సైనిక వర్గాలు మండిపడుతున్నాయి. ఇందులో భాగంగానే పాక్ నౌకాదళం సైనిక విన్యాసాలు చేస్తూ, భారత్‌కు హెచ్చరికలు జారీ చేసే ప్రయత్నాలు చేస్తోందని అంటున్నారు.

కాగా, పాకిస్థాన్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ మరోసారి భారత్‌పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. సింధు జలాలను అడ్డుకునేందుకు ఆ నదిపై భారత్‌ చేపట్టే ఏ నిర్మాణాన్నైనా పాక్‌ ధ్వంసం చేస్తుందని వ్యాఖ్యానించారు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా సింధు జలాలు పాక్‌కు రాకుండా నదిపై భారత్‌ డ్యామ్‌ కడితే ఏం చేస్తారని పశ్నించగా ఈ విధంగా బదులిచ్చారు. ‘ఒకవేళ భారత్ ఆ పనిచేస్తే ఎలాంటి కట్టడాలనైనా పాక్‌ ధ్వంసం చేస్తుంది’ అని సమాధానమిచ్చారు.