
ప్రపంచ ఎంటర్టైన్మెంట్ హబ్గా భారత్ మారనుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ముంబైలో నాలుగు రోజుల పాటు జరగనున్న వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్)ను ఆయన గురువారం అట్టహాసంగా ప్రారంభించారు. సినీ నిర్మాణం, డిజిటల్ కంటెంట్, గేమింగ్, ఫ్యాషన్, సంగీతం, ప్రత్యక్ష సంగీత కచేరీలకు వేవ్స్ వేదికకానుంది.
100కు పైగా దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. వినోదరంగంలో భారత్ను అగ్రగామిగా నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ సదస్సును ఏర్పాటు చేయగా బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ దిగ్గజాలు షారుఖ్ఖాన్, ఆమీర్ఖాన్, అక్షయ్కుమార్, హేమమాలిని, దీపిక పదుకొనే, అలియా భట్, రణ్బీర్ కపూర్, చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, ఎంఎం కీరవాణి, శ్రీలీల, రజనీకాంత్, మోహన్లాల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కీరవాణి స్వరకల్పనలో రుగ్వేదంలోని శ్లోకాలతో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ గీతాన్ని శ్రేయాఘోషల్, చిత్ర, మంగ్లి, లిక్సిక ఆలపించారు. భానుమతి, గురుదత్, సలీల్ చౌదరిల శతజయంతి సందర్భంగా ఇదే వేదికపై వారి స్టాంపులను ప్రధాని ఆవిష్కరించారు. భానుమతి మనవరాలు మీనాక్షి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ భారత్ ఎంటర్టైన్మెంట్ హబ్గా మారుతోందని, వేవ్స్ వల్ల ఆరెంజ్ ఎకానమీకి నాంది పడుతుందని పేర్కొన్నారు.
‘‘సృజనాత్మకతకు కేంద్రంగా వేవ్స్ తయారై కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలి. 1913లో రాజా హరిశ్చంద్ర సినిమాతో మన దేశ ఘనత నలుదిశలకు వ్యాపించింది. ఇటీవల 50 దేశాల గాయకులు ‘వైష్ణవ జనతో’ గీతాన్ని ఆలపించారు. సృజన ఉన్న యువత దేశానికి అసలుసిసలు ఆస్తి. కంటెంట్ క్రియేటర్లను ప్రోత్సహిస్తాం. క్రియేట్ ఇన్ ఇండియా, క్రియేట్ ఫర్ వరల్డ్’’అని పేర్కొన్నారు.
‘‘వేవ్స్ అనేది సంస్కృతి, సృజనల అనుసంధానం. సృజనను ప్రోత్సహించేందుకు త్వరలో ‘వేవ్స్ అవార్డు’లను ప్రవేశపెడతాం’’ అని తెలిపారు. మానవతావాద వ్యతిరేక ఆలోచనల నుండి యువతరాన్ని కాపాడుకోవాల్సిన అవసరం చాలా వుందని ఆయన పేర్కొన్నారు. ఈనాడు ప్రజల జీవితాల్లో సాంకేతిక పరిజ్ఞానం చాలా కీలక పాత్ర పోషిస్తోందని, అందువల్ల మానవుల్లో సున్నితత్వాన్ని కాపాడుకోవడానికి అదనపు కృషి అవసరమని ప్రధాని అభిప్రాయపడ్డారు.
”స్టోరీ టెల్లింగ్ (కథలు చెప్పడం)కు కొత్త మార్గాల కోసం యావత్ ప్రపంచం ఎదురుచూస్తున్న వేళ ప్రపంచం కోసం భారత్లో సృష్టించేందుకు ఇదే సరైన సమయం” అని ప్రధాని వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా సృష్టికర్తలు, కథకులు (స్టోరీ టెల్లర్స్), ఆవిష్కర్తలు, విధాన రూపకర్తలను ఏకం చేసే పరివర్తనా వేదికగా వేవ్స్ సదస్సును ఆయన అభివర్ణించారు.
దాదాపు 30 దేశాల నుండి వచ్చిన అంతర్జాతీయ ప్రతినిధులు హాజరైన ఆడిటోరియంలో ప్రధాని మాట్లాడుతూ ప్రతిభ, సృజనాత్మకతకు సంబంధించి ఒక అంతర్జాతీయ వ్యవస్థకు వేవ్స్ వేదికగా పునాది వేయాలని అన్నారు. మన భారతీయ కథల్లో శాస్త్రీయ పరిజ్ఞానం, కల్పనలు, ధైర్యసాహసాలు అన్నీ వుంటాయని, వైవిధ్యభరితమైన వాటిని ప్రపంచ ప్రజల ముందుంచడమే వేవ్స్ అతిపెద్ద బాధ్యత అని ప్రధాని పేర్కొన్నారు.
భారత స్ఫూర్తిని ప్రపంచ నలుమూలలకు తీసుకెళ్లడంలో భారతీయ సినిమా విజయం సాధించిందని చెప్పారు. రష్యాలో రాజ్కపూర్ వారసత్వం నుండి, కేన్స్లో సత్యజిత్ రే ప్రతిభ, ఆస్కార్స్లో ట్రిపుల్ ఆర్ ఘన విజయం ఇంతకంటే ఎక్కువ విషయాలే చెబుతాయని వ్యాఖ్యానించారు.
ప్రధాని మోదీ పోరాటయోధుడని ప్రముఖ నటుడు రజనీకాంత్ ప్రశంసించారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో వేవ్స్ కార్యక్రమాన్ని వాయిదా వేస్తారని కొందరు భావించారని చెప్పా రు. కానీ ఈ కార్యక్రమం వాయుదా పడదని తాను గాఢంగా నమ్మానని చెప్పారు. ప్రధాని మోదీ నేతృత్వంలో వినోద రంగంలో భారత్ అగ్రగామిగా నిలుస్తుందని బాలీవుడ్ నటుడు షారుఖ్ అభిప్రాయపడ్డారు.
కాగా ఐఐఎం, ఐఐటీల తరహాలో క్రియేటర్ల కోసం రూ.400 కోట్లతో ముంబైలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీని ప్రారంభిస్తామని కేంద్ర ఐటీ, సమాచారశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. మహారాష్ట్ర ప్రభుత్వం దీనికి భూమిని ఇవ్వటానికి అంగీకరించిందని తెలిపారు.
More Stories
ఆఫ్ఘన్ భూభాగాన్ని మరో దేశంకు వ్యతిరేకంగా అనుమతించం!
మరియా కొరీనా మచాడోకు నోబెల్ శాంతి బహుమతి
ఆంగ్లేయుల గురించి ఏనాడూ భ్రమలు లేవు, రాజీ పడింది లేదు