రక్షణ దళాల కదలికల ప్రసారాలపై కేంద్రం ఆంక్షలు!

రక్షణ దళాల కదలికల ప్రసారాలపై కేంద్రం ఆంక్షలు!
పహల్గాం ఉగ్రదాడితో ఇప్పుడు పాకిస్థాన్- భారత్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. దేశవ్యాప్తంగా ప్రజలు ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్నారు. సరిహద్దుల్లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది.  భారత్ పాకిస్థాన్ సరిహద్దుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టంగా మారింది.ఇటువంటి సమయంలో జాతీయ భద్రత దృష్ట్యా రక్షణ కార్యకలాపాలు, భద్రతా దళాల కదలికలను ప్రత్యక్ష ప్రసారం చేయకుండా ఉండాలని అన్ని మీడియా ఛానెల్‌లకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ శనివారం ఒక సలహా జారీ చేసింది. 
రక్షణ శాఖ ఆపరేషన్లు, భద్రతా బలగాల కదలికలకు సంబంధించిన ప్రత్యక్ష ప్రసారాలు చేయకుండా సంయమనం పాటించాల్సిందిగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ శనివారం అన్ని మీడియా సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.  జాతీయ భద్రతా ప్రయోజనాల దృష్ట్యా, అన్ని మీడియా వేదికలు, వార్తా సంస్థలు, సోషల్‌ మీడియా యూజర్లు అత్యంత బాధ్యతతో వ్యహరిస్తూ, రక్షణ రంగ, భద్రతాపరమైన అంశాలపై రిపోర్టింగ్‌ చేసేటపుడు ప్రస్తుతమున్న చట్టాలు, నిబంధనలకు పూర్తిగా కట్టుబడి వుండాలని పేర్కొంది. పహల్గాం దాడి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఉగ్రవాద వ్యతిరేక చర్యలు చేపట్టాలని కేంద్రం యోచిస్తోంది. 
 
ఈ పరిస్థితుల్లో వాస్తవిక కవరేజ్‌, సంబంధిత చిత్రాలను పంచుకోవడం, లేదా రక్షణ రంగ ఆపరేషన్లకు సంబంధించి మూలాల నుండి రిపోర్టింగ్‌ చేయడం ఆపాలని కోరింది  “జాతీయ భద్రత దృష్ట్యా, అన్ని మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, వార్తా సంస్థలు, సోషల్ మీడియా వినియోగదారులు రక్షణ, ఇతర భద్రతా సంబంధిత కార్యకలాపాలకు సంబంధించిన విషయాలను నివేదించేటప్పుడు అత్యంత బాధ్యత వహించాలని, ప్రస్తుత చట్టాలు, నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు” అని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తెలిపింది.
 
“ప్రత్యేకంగా లైవ్ కవరేజ్, దృశ్యాల వ్యాప్తి లేదా రక్షణ కార్యకలాపాలు లేదా కదలికలకు సంబంధించిన ‘మూలాల ఆధారిత’ సమాచారం ఆధారంగా నివేదించడం చేపట్టకూడదు” అని స్పష్టం చేసింది. సున్నితమైన సమాచారాన్ని అకాలంగా బహిర్గతం చేయడం వల్ల అనుకోకుండా శత్రు శక్తులకు సహాయపడవచ్చు, కార్యాచరణ ప్రభావం, సిబ్బంది భద్రతకు హాని కలిగించవచ్చు అని హెచ్చరించింది. 
 
కార్గిల్‌ యుద్ధం, ముంబయి తీవ్రవాద దాడులు, కాందహార్‌ హైజాకింగ్‌ వంటి కొన్ని సంఘటనల సమయాల్లో కవరేజీపై ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రసారాలు కావడంతో అనుకోని విపత్కర పర్యవసానాలు ఎదురయ్యాయని మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు.