భారత్, పాకిస్థాన్లు సంయమనం పాటించాలని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ కోరినట్లు ఆయన ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ పేర్కొన్నారు. ఉగ్రదాడిని ఐరాస తీవ్రంగా ఖండిస్తోందన్న ఆయన ప్రస్తుతం ఇరుదేశాలు సంయమనం పాటించాలని సూచించారని చెప్పారు. ఇరుదేశాల మధ్య పరిస్థితులను గుటెరస్ నిశితంగా పరిశీలిస్తున్నారని, పహల్గాం ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
జమ్ముకాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని సెక్రటరీ జనరల్ ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. పౌరులపై దాడులు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య భారత్, పాకిస్థాన్ ప్రభుత్వాలతో గుటెరస్ చర్చించారా? అన్న ప్రశ్నకు డుజారిక్ సమాధానమిచ్చారు.
భారత్, పాకిస్థాన్లతో ప్రత్యక్షంగా మాట్లాడలేదని, కానీ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారని చెప్పగలనని చెప్పారు. భారత్, పాక్ ప్రభుత్వాలు సంయమనం పాటించాలని, ఇరుదేశాల మధ్య పరిస్థితి మెరుగయ్యేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని గుటెరస్ కోరారని పేర్కొన్నారు. సమస్యలను అర్థవంతమైన, పరస్పర చర్యలద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు.
“జమ్మూ కశ్మీర్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని ఐరాస తీవ్రంగా ఖండిస్తోంది. పౌరులపై దాడి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. గుటెర్రస్ ఈ ఆందోళనకర పరిస్థితిని నిశితింగా పరిశీలిస్తున్నారు. భారత్-పాకిస్థాన్ దేశాలు సంయమనం పాటించాలని కోరుతున్నాం. ఇరుదేశాల మధ్య ఏదైనా సమస్య ఉంటే శాంతియుత చర్చలతో వాటిని పరిష్కరించుకుంటారని ఆశిస్తున్నాం” అని పేర్కొన్నారు.
ఉగ్రదాడికి ప్రతిగా సింధూ నదీ జలాల ఒప్పందం అమలును భారత్ నిలిపివేయడంపై మీడియా ప్రశ్నించగా.. ఈ ఉద్రిక్తతల వేళ ఇరుదేశాలు సంయమనం పాటించి, పరిస్థితులు మెరుగుపడేలా చర్యలు తీసుకుంటాయని ఆశిస్తున్నామని చెప్పారు.

More Stories
రక్షణ వ్యయం పెంపుపై జి7 దేశాల మధ్య విబేధాలు
ప్రజాస్వామ్యం పునరుద్ధరిస్తే స్వదేశంకు హసీనా సిద్ధం!
అమెరికాలో ప్రతిభావంతులు లేరు.. విదేశీ ప్రతిభ అవసరమే