వక్ఫ్ సవాల్‌ చేసిన పిటిషన్లను కొట్టివేయాలని కోరిన కేంద్రం

వక్ఫ్ సవాల్‌ చేసిన పిటిషన్లను కొట్టివేయాలని కోరిన కేంద్రం
వక్ఫ్‌ సవరణ చట్టం రాజ్యాంగబద్ధంగానే ఉందని సుప్రీం కోర్టుకు తెలిపింది కేంద్రం. వక్ఫ్‌ సవరణ చట్టం చెల్లుబాటుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను అన్నిటినీ కొట్టివేయాలని సుప్రీం కోర్టులో కేంద్రం 1332 పేజీలతో అఫిడవిట్‌ దాఖలు చేసింది. వక్ఫ్‌ చట్టంలో తీసుకొచ్చిన సవరణల్ని సమర్థించుకున్న కేంద్ర ప్రభుత్వం, పార్లమెంటు ఆమోదించిన చట్టాలకు రాజ్యాంగ బద్ధమైన అంచనా ఉంటుందని పేర్కొంది. 

ఈ చట్టంలో చేసిన పలు సవరణలు మత స్వేచ్ఛకు సంబంధించిన ప్రాథమిక హక్కులను హరిస్తాయనే తప్పుడు ప్రాతిపదికపై పిటిషన్లు ఉన్నాయని కేంద్రం ఆరోపించింది.  వక్ఫ్‌ చట్టంలో తీసుకొచ్చిన సవరణలు మత స్వేచ్ఛకు సంబంధించిన ప్రాథమిక హక్కుల్ని హరిస్తాయనడం అర్థరహితమని తెలిపింది. మొఘల్‌ పాలన నుంచి స్వాతంత్ర్య పూర్వాపర కాలం వరకు వక్ఫ్‌ వద్ద మొత్తంగా కోటీ80 లక్షల 29వేల 163 ఎకరాల భూమి ఉంటే ఆశ్చర్యకరంగా 2013 తర్వాత అదనంగా 21 లక్షల హెక్టార్లు పెరిగాయని కేంద్రం అఫిడవిట్లో వెల్లడించింది. 

పాత వక్ఫ్‌ చట్టంలోని నిబంధనలు దుర్వినియోగం జరిగి ప్రైవేటు, ప్రభుత్వ ఆస్తులు ఆక్రమణకు గురయ్యాయని అఫిడవిట్‌లో కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ తెలిపింది. అందుకే పార్లమెంటరీ ప్యానెల్ సమగ్రంగా లోతైన అధ్యయనం చేశాకే కొత్త సవరణలు తీస్కొచ్చినట్లు తెలిపింది.  ఆర్టికల్‌ 32 ప్రకారం ఒక చట్టాన్ని సుప్రీం కోర్టు సమీక్షించవచ్చని చెప్పింది.  వక్ఫ్‌ వంటి బోర్డులు వాటిపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా జవాబుదారీతనం ఉండేలా పార్లమెంటు సవరణలను తీసుకొచ్చిందని పేర్కొంది. ఈ మేరకు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ షేర్షా సి షేక్ మొహిద్దీన్ అఫిడవిట్ దాఖలు చేశారు.

వక్ఫ్‌ చట్టం రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ సుమారు 72 పిటిషన్లు దాఖలు కాగా వీటిపై ఏప్రిల్‌ 17న సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే ముందు దీనిపై సమాధానం ఇచ్చేందుకు కేంద్రానికి వారం గడువు ఇచ్చింది. తదుపరి విచారణ వరకు వక్ఫ్‌ ఆస్తులను డీనోటీఫై చేయబోమని కేంద్రం సుప్రీం కోర్టుకు హామీ ఇచ్చింది. అయితే, అప్పటివరకు వక్ఫ్‌ కౌన్సిల్‌లో ముస్లిమేతరులను సభ్యులుగా నియమించవద్దని సూచించింది. అనంతరం తదుపరి విచారణను మే 5కు వాయిదా వేసింది.