పహల్గాం ఉగ్ర దాడిలో భద్రతా లోపాలు నిజమే

పహల్గాం ఉగ్ర దాడిలో భద్రతా లోపాలు నిజమే
పహల్గాం ఉగ్ర దాడిలో భద్రతా లోపాలు ఉన్న మాట నిజమేనని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా గురువారం జరిగిన అఖిల పక్ష సమావేశంలో ఒప్పుకున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి.  ”ఏమీ తప్పు జరగకపోతే, మనం ఇక్కడ ఎందుకు కూర్చోంటాం? మనం కనుగొనాల్సిన చోట లోపాలు ఉన్నాయి. భద్రతా వైఫల్యానికి కారణాలు తెలుసుకోవాలి” అని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. 
 
జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడి తరువాత ప్రతిపక్ష నాయకులకు వివరించడానికి ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో అనేక ప్రతిపక్ష పార్టీల నేతలు భద్రతా ప్రోటోకాల్‌ల వైఫల్యం గురించి ప్రశ్నలు అడిగారు. ”భద్రతా దళాలు ఎక్కడ ఉన్నాయి? సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ ఎక్కడ ఉంది?” అని పలువురు నాయకులు అడిగారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 
 
దీనికి ప్రతి స్పందిస్తూ అమిత్ షా అనంత్‌నాగ్‌ జిల్లాలోని పహల్గామ్‌ సమీపంలోని బైసరన్‌ ప్రాంతాన్ని తెరవడానికి ముందు స్థానిక అధికారులు భద్రతా సంస్థలకు సమాచారం ఇవ్వలేదని చెప్పినట్లు తెలుస్తోంది. ఇది సాంప్రదాయకంగా జూన్‌లో అమర్‌నాథ్‌ యాత్ర వరకు పరిమితం చేయబడిందని తెలిపినట్లు పేర్కొన్నారు. . ఘటన జరిగిన తర్వాత స్పందించడంలో జరిగిన జాప్యంపై కూడా ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయని ఆ వర్గాలు తెలిపాయి. 
 
దీనికి అధికారులు వివరణ ఇస్తూ బైసారన్‌ ప్రాంతానికి చేరుకోవాలంటే పర్వత మార్గంలో45 నిమిషాలు ప్రయాణించాల్సి ఉంటుందని, ఇటువంటి అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనడానికి తమకు స్పష్టమైన నియమ నిబంధనలు ఏమీ లేవని తెలియచేసారు. ఉగ్రవాద సమస్యను ఎదుర్కోవడంలో సంపూర్ణ సహకారం అందజేస్తామని ప్రభుత్వానికి ప్రతిపక్షాలు హామీ ఇచ్చాయి.
 
ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టాలని పార్టీలకు అతీతంగా ఎంపీలు అందరూ ప్రభుత్వాన్ని కోరారు. ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకుంటామని అఖిలపక్ష సమావేశంలో కేంద్రం హామీ ఇచ్చింది. జమ్ముకశ్మీర్‌ ఆర్థిక వ్యవస్థ పుంజుకుని, పర్యాటకం వృద్ధి చెందుతున్న సమయంలో ఈ ఉగ్రదాడి జరిగిందని కేంద్ర మంత్రి రిజిజు తెలిపారు.

గురువారం పార్లమెంట్‌ హౌస్‌ కాంప్లెక్స్‌లో దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశానికి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షత వహించారు. తొలుత పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన అమాయక ప్రజలకు నివాళులర్పిస్తూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.

సమావేశానంతరం ప్రతిపక్షనేత రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని అన్ని ప్రతిపక్ష పార్టీలు ఖండించాయని, అవసరమైన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వానికి పూర్తి మద్దతునిచ్చాయని తెలిపారు. ఆప్‌ ఎంపీ సంజయ్ సింగ్‌ మాట్లాడుతూ ”దేశం మొత్తం ఈ ఘటనపై కోపంగా, విచారంగా ఉంది. దేశం, కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులకు వారి భాషలో తగిన సమాధానం ఇవ్వాలని కోరుకుంటోంది” అని చెప్పారు. 

“వారు అమాయక ప్రజలను చంపిన విధంగా వారి శిబిరాలను నాశనం చేయాలి. పాకిస్తాన్‌పై కూడా చర్యలు తీసుకోవాలి. ఈ సంఘటన ఏప్రిల్‌ 22న జరిగింది. ఏప్రిల్‌ 20న భద్రతా సంస్థల సమాచారం లేని ఆ స్థలాన్ని తెరిచారు. భద్రతా సంస్థలకు ఎటువంటి సమాచారం లేదు. జవాబుదారీ ఎవరనేది నిర్థారించాలి. భద్రతా లోపం ఎందుకు జరిగిందో చర్య తీసుకోవాలని మేము డిమాండ్‌ చేశాం” అని ఆయన పేర్కొన్నారు.

సిపిఎం ఎంపి బికాష్‌ రంజన్‌ భట్టాచార్య మాట్లాడుతూ ఉగ్రదాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, ఉగ్రవాదాన్ని అణచివేయడానికి ప్రభుత్వం తీసుకునే చర్యలను తమ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి మద్దతునిస్తుందని, అయితే తమకు కొన్ని సందేహాలు ఉన్నాయని తెలిపారు. ఉగ్రవాద దాడి జరిగిన స్థానంలో ఒక్క భద్రతా సిబ్బంది లేకపోవడానికి కారణం ఎవరని ప్రశ్నించారు. పుల్వామా దాడికి సంబంధించిన రిపోర్టు ఎక్కడుంది? దాని గురించి ఎవరికీ తెలియదు. దాని నుంచి ప్రభుత్వం ఎటువంటి గుణపాఠం నేర్చుకుంది? అని ప్రశ్నించారు.

 
కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు మాట్లాడుతూ ”పహల్గాంలో జరిగిన ఘటన గురించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ క్యాబినెట్‌ కమిటీ ఆన్‌ సెక్యూరిటీ (సిసిఎస్‌) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను తెలియజేశారు. ఈ సంఘటన చాలా విచారకరం. దీని కారణంగా దేశంలోని ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కూడా మరింత కఠిన చర్యలు తీసుకోవాలనే ఉద్దేశాన్ని వ్యక్తం చేసింది” అని తెలిపారు. 
 
ఈ ఘటన కాశ్మీర్‌లోని ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీసిందని, అందరూ దీనిపై తమ ఆందోళనను వ్యక్తం చేశారని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను స్పష్టం చేశాయని, దేశం ఐక్యంగా నిలబడాలని చెప్పారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఒకే గొంతుతో మాట్లాడాలనే ఏకాభిప్రాయం అన్ని రాజకీయ పార్టీల్లో ఉందని తెలిపారు. 
 
ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు ఎస్‌ జైశంకర్‌, నిర్మలా సీతారామన్‌, బిజెపి అధ్యక్షులు జెపి నడ్డా, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు  మల్లికార్జున్‌ ఖర్గే, డిఎంకె ఎంపి తిరుచ్చి శివ, ఎన్‌సిపి ఎంపి ప్రఫుల్‌ పటేల్‌, ఎన్‌సిపి (ఎస్‌పి) ఎంపి సుప్రియా సూలే, ఎస్‌పి ఎంపి రామ్‌ గోపాల్‌ యాదవ్‌, ఆర్‌జెడి ఎంపి ప్రేమ్‌ చంద్‌ గుప్తా, టిడిపి ఎంపి లావు శ్రీకృష్ణ దేవరాయులు, వైసిపి ఎంపి పివి మిధున్‌ రెడ్డి, తృణమూల్‌ ఎంపి సుదీప్‌ బందోపాధ్యాయ, ఎంఐఎం ఎంపి అసదుద్దీన్‌ ఓవైసీ, బిజెడి ఎంపీ సస్మిత్‌ పాత్ర, శివసేన (షిండే) ఎంపి శ్రీకాంత్‌ షిండే తదితరులు పాల్గొన్నారు.