అమరావతిలో రూ 1 లక్ష కోట్ల పనులకు ప్రధాని మోదీ శ్రీకారం

అమరావతిలో రూ 1 లక్ష కోట్ల పనులకు ప్రధాని మోదీ శ్రీకారం

అమరావతిలో రూ.లక్ష కోట్ల విలువైన పనులకు ప్రధాని నరేంద్ర మోదీ మే 2న శంకుస్థాపన చేస్తారని, దీనికి అవసరమైన ఏర్పాట్లను శరవేగంగా పూర్తి చేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి డా. పి. నారాయణ తెలిపారు. బుధవారం  గుంటూరు రేంజ్‌ ఐజి సర్వశ్రేష్టి త్రిపాఠి, ఎస్‌పి సతీష్‌కుమార్‌తో కలిసి రాజధాని పరిధిలో మంత్రి పర్యటించారు. వెలగపూడిలోని సభావేదిక వద్దకు వెళ్లేందుకు మొత్తం ఎనిమిది రోడ్లను గుర్తించారు. 11 పార్కింగు స్థలాలను ఏర్పాటు చేశారు. 

పర్యటన విజయవంతం చేసేందుకు అన్ని శాఖలూ సమన్వయంతో పనిచేస్తున్నాయని మంత్రి తెలిపారు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో రూ.ఐదు వేల కోట్ల వరకూ ఖర్చు చేశామని, పలు రోడ్లను కూడా నిర్మించామని తెలిపారు. వైసిపి ప్రభుత్వం రాజధాని విషయంలో మూడుముక్కలాట ఆడి అడవిలా మార్చిందని ధ్వజమెత్తారు. మళ్లీ టిడిపి ప్రభుత్వం రాగానే పనులు ప్రారంభించామని చెప్పారు. 

రూ.64 వేల కోట్ల విలువైన పనులకు అథారిటీలో అనుమతి తీసుకున్నామని, రూ.41 వేల కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచామని, వాటిని ప్రధాని చేతుల మీదుగా ప్రారంభిస్తామని తెలిపారు. ఐదు లక్షల మంది సభకు వస్తారని అంచనా వేసినట్లు పేర్కొన్నారు. మూడు గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకునే ప్రధాని అక్కడ నుండి వెలగపూడి చేరుకుని కిలోమీటరు దూరం రోడ్‌షో నిర్వహిస్తారని తెలిపారు. 

ఈ 11, 13, 15 రోడ్లతోపాటు సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు నుండి కూడా రాకపోకలు జరుగుతాయని వివరించారు. ఇప్పటికే పోలీస్‌శాఖ రోడ్లను పరిశీలించి గుంతలు పూడ్చాలని కోరిందని తెలిపారు. ప్రధాని సభకు వచ్చే వాహనాల కోసం సరిపోయినంతగా పార్కింగ్ ఏర్పాటు చేశామని వివరించారు. 

మంగళగిరి నుండి రెండు, తాడేపల్లి నుండి ఒకటి, వెస్ట్‌బైపాస్‌ నుండి ఒకటి, ప్రకాశం బ్యారేజీ నుండి రెండు, తాడికొండ, హరిశ్చంద్రపురం నుండి ఒకరోడ్డు ద్వారా సభా వేదిక వద్దకు చేరుకోవచ్చని పేర్కొన్నారు. వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందీ ఉండదని, ట్రాఫిక్‌ జామ్‌కు అవకాశం లేకుండా అన్ని చర్యలూ తీసుకున్నామని పేర్కొన్నారు. పోలీస్‌శాఖ సూచనల మేరకు రోడ్లను బాగుచేయాలని సిఆర్‌డిఎ అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు.