
దాదాపు 12,500 కోట్ల డాలర్ల (సుమారు రూ.10.65 లక్షల కోట్లు) స్థాయికి చేరిన దేశీయ ఈ-కామర్స్పైనా అమెరికా కన్నేసింది. తన అమెజాన్, వాల్మార్ట్ కంపెనీలకూ భారత్ ఈ-కామర్స్ మార్కెట్ తలుపులు బార్లా తెరవాలని అమెరికా ఒత్తిడి చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన సమావేశంలోనూ ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ విషయాన్ని గట్టిగా ప్రస్తావించినట్టు సమాచారం.
అమెరికా వాణిజ్య ప్రతినిధి (యూఎ్సటీఆర్) జామీసన్ గ్రీర్ కూడా ఈ విషయంలో పట్టుదలతో ఉన్నారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ సుంకాలు తగ్గించడంతో పాటు వివక్షాపూరితమైన ఆంక్షలనూ తొలగించాని డిమాండ్ చేశారు. దేశీయ ఈ-కామర్స్ మార్కెట్ శరవేగంగా విస్తరిస్తోంది. క్విక్ కామర్స్ కంపెనీలైతే దేశంలోని దాదాపు 100 ప్రధాన నగరాల్లోకి చొచ్చుకుపోయాయి.
ఈ మార్కెట్లో ప్రస్తుతం అమెరికా రిటైల్ దిగ్గజం వాల్మార్ట్ భారత అనుబంధ సంస్థ ఫ్లిప్కార్ట్దే హవా. మరో అమెరికా రిటైల్ దిగ్గజం అమెజాన్ కూడా ఈ రంగంలో నువ్వా నేనా అన్నట్టు పోటీపడుతోంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం విదేశీ ఈ-కామర్స్ సంస్థలు ఇతర సంస్థల వస్తు,సేవలకు మార్కెట్ వేదికలుగా మాత్రమే పని చేయాలి. అవి నేరుగా వస్తువులను తయారు చేసి స్టోర్ చేసి తమ ప్లాట్ఫామ్స్ ద్వారా నేరుగా ఆన్లైన్లో విక్రయించేందుకు వీల్లేదు.
వివక్షాపూరితమైన ఈ ఆంక్షలను ఎత్తివేయాలని అమెరికా ప్రస్తుతం మోదీ సర్కారుపై ఒత్తిడి చేస్తుంది. భారత్ లో అమెజాన్కు 4 కోట్లు, ఫ్లిప్కార్ట్కు 5 కోట్ల చొప్పున డైలీ యాక్టివ్ వినియోగదారులున్నారు. అమెజాన్ 32 శాతం, ఫ్లిప్కార్ట్ 38 శాతం చొప్పున మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం అమెరికా ఒత్తిడికి లొంగిపోతే దేశంలోని కిరాణా దుకాణాలకు అది ఉరితాడులా మారుతుందని అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (సీఏఐటీ) హెచ్చరిస్తోంది.
ఈ-కామర్స్ సంస్థల అడ్డగోలు ధరలు, డిస్కౌంట్లకు తట్టుకోలేక గత రెండు మూడేళ్లలో దాదాపు 10 లక్షల కిరాణా దుకాణాలు మూతపడి లక్షల మంది ఉపాధిలేక రోడ్డున పడిన విషయాన్ని గుర్తు చేసింది. అమెరికా ఈ-కామర్స్ దిగ్గజాలకూ సమాన అవకాశాలు కల్పించడం అంటే రిలయన్స్ రిటైల్, డీమార్ట్ వంటి దేశీయ రిటైల్ దిగ్గజాలకూ ముప్పని హెచ్చరించింది.
విదేశీ పెట్టుబడులను స్వాగతించవచ్చని.. అలాగని భారత రిటైల్ మార్కెట్ను ఇష్టానుసారం మార్చేసి చిరు వ్యాపారుల ప్రయోజనాలను దెబ్బతీయడం ఎంత మాత్రం సరికాదని సీఏఐటీ కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ పేర్కొన్నారు. ఒక వేళ వాల్మార్ట్, అమెజాన్లకు భారత్ మార్కెట్లో ఆంక్షలు లేని అనుమతులు ఇస్తే ఇవి నేరుగా దుకాణాలు తెరిచి ఇక్కడి రిటైల్ మార్కెట్ను పూర్తిగా నాశనం చేయనున్నాయని రిటైల్ వర్తకుల ప్రధాన ఆందోళనగా ఉంది.
More Stories
భారత్, అమెరికా జులై 8లోపు మధ్యంతర వాణిజ్య ఒప్పందం!
రన్యా రావు కేసులో హోంమంత్రి విద్యాసంస్థలో ఈడీ సోదాలు
రూ 6,000 కోట్లు దారి మళ్లించిన యూకో బ్యాంక్ మాజీ సీఎండీ