ఉగ్రదాడి సమయంలో భారత్ కు ట్రంప్ మద్దతు

ఉగ్రదాడి సమయంలో భారత్ కు ట్రంప్ మద్దతు
జమ్ముకశ్మీర్‌ అనంత్ నాగ్ జిల్లా పహల్గామ్‌ ఉగ్ర దాడి ఘటన పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విచారం వ్యక్తం చేశారు. ఈ దాడి తనను తీవ్రంగా కలిచివేసిందని పేర్కొన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశించిన ఆయన, ఈ సమయంలో భారత్​కు తమ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు తన సోషల్‌ మీడియా ట్రూత్‌లో పోస్ట్ షేర్ చేశారు.

‘కశ్మీర్‌ ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. తీవ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌కు అమెరికా మద్దతుగా ఉంటుంది. మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి. ప్రధాని మోదీ, భారత దేశ ప్రజలకు మా పూర్తి మద్దతు ఉంటుంది’ అని ట్రంప్‌ పేర్కొన్నారు.  మరోవైపు, డొనాల్డ్‌ ట్రంప్‌ భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్‌లో మాట్లాడారు. ఉగ్రదాడిని ట్రంప్‌ తీవ్రంగా ఖండించినట్లు భారత విదేశాంగ శాఖ పేర్కొంది. ప్రధాని మోదీకి ట్రంప్‌ ఫోన్‌ చేసిన విషయాన్ని విదేశీ వ్యవహరాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ ఎక్స్‌లో పోస్టు చేశారు. 

“ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఫోన్‌ చేసి మాట్లాడారు. ఉగ్రదాడిలో బలైన వారికి సంతాపం తెలిపారు. ఉగ్ర ఘటనను ట్రంప్‌ తీవ్రంగా ఖండించారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిని చట్టం ముందుకు తీసుకురావడానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని ట్రంప్‌ పేర్కొన్నారు. ఉగ్రవాద పోరులో అమెరికా, భారత్‌ ఒకరికొకరు కలిసి పోరాడుతాయి” అని ఎక్స్‌లో రణధీర్‌ జైస్వాల్‌ తెలిపారు.

ట్రంప్‌ ఫోన్‌ చేసి మద్దతుగా మాట్లాడడంతో ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని, వారి మద్దతు దారులను చట్టం ముందు నిలబెట్టడానికి భారత్‌ కృత నిశ్చయంతో ఉన్నట్లు మోదీ పేర్కొన్నారు.

కాగా, ఈ ఉగ్రదాడిపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ కూడా విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న జేడీ వాన్స్‌ దంపతులు దీనిని వినాశకర ఉగ్ర దాడిగా పేర్కొన్నారు. బాధితులకు వాన్స్ దంపతులు సంతాపం ప్రకటించారు. ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ట్వీట్‌పై వాన్స్ ఈ మేరకు స్పందించారు.పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై భారత్‌లోని ఇజ్రాయెల్‌ రాయబారి స్పందించింది. ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో భారత్‌కు మద్దతుగా నిలుస్తామని పేర్కొంది.