బిల్లుల ఆమోదానికి తొలిసారి రాష్ట్రపతికి సుప్రీం గడువు

బిల్లుల ఆమోదానికి తొలిసారి రాష్ట్రపతికి సుప్రీం గడువు
రాష్ట్రపతి పరిశీలన కోసం గవర్నర్లు పంపే బిల్లులను ఉద్దేశించి సుప్రీంకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. గవర్నర్‌లు పంపిన బిల్లులపై రాష్ట్రపతి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. కాగా రాష్ట్రపతికి గడువు నిర్దేశిస్తూ అత్యున్నత న్యాయస్థానం ఈ తరహా తీర్పు చెప్పడం ఇదే తొలిసారి.

ఇదిలావుంటే తమిళనాడు శాసనసభ ఆమోదించిన 10 బిల్లులను రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవికుమార్‌ తొక్కిపెట్టడం రాజ్యాంగ విరుద్ధమని ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఏదైనా బిల్లును మంత్రి మండలి సలహా మేరకు రాష్ట్రపతి ఆమోదం కోసం నిలిపి ఉంచాల్సివస్తే అందుకు గవర్నర్‌ తీసుకోదగిన అత్యధిక గడువు ఒక నెల మాత్రమేనని సంచలనాత్మక తీర్పు చెప్పింది. 

శాసనసభ ఆమోదించిన బిల్లులపై గవర్నర్‌ చర్యలు తీసుకోవడానికి గడువును నిర్దేశిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేయడం కూడా ఇదే ప్రథమం. ఒకవేళ మంత్రిమండలి సలహా లేకుండా గవర్నర్‌ బిల్లు ఆమోదాన్ని నిలిపి ఉంచాలని భావిస్తే మూడు నెలల్లోగా ఆ బిల్లును శాసనసభకు తిరిగి పంపాలని సూచించింది. 

గవర్నర్‌ ఈ కాల నిర్దేశాన్ని పాటించకపోతే ఆయన చర్యపై కోర్టులు న్యాయసమీక్ష జరపవచ్చని పేర్కొంది. మంత్రిమండలి సలహా మేరకు పనిచేయడం తప్ప గవర్నర్‌కు విచక్షణాధికారాలేవీ లేవని, రాజ్యాంగంలోని 200వ అధికరణం కూడా ఇదే విషయాన్ని స్పష్టంచేస్తోందని తెలిపింది. రెండోసారి సమర్పించిన బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం రిజర్వు చేసి ఉంచే అధికారం గవర్నర్‌కు లేదని వ్యాఖ్యానించింది.

415 పేజీలతో కూడిన నాలుగు రోజుల క్రితం ఇచ్చిన తీర్పు పూర్తి పాఠాన్ని శుక్రవారం రాత్రి 10.54 గంటలకు సుప్రీంకోర్టు వెస్‌సైట్‌లో ఉంచారు. కాగా, గవర్నర్లు పంపే బిల్లుపై రాష్ట్రపతి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్‌లో కూడిన ధర్మాసం తాజాగా తీర్పునిచ్చింది.

 
“హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్దేశించిన కాలక్రమాన్ని స్వీకరించడం సముచితమని మేము భావిస్తున్నాము. గవర్నర్ పరిశీలన కోసం రిజర్వ్ చేసిన బిల్లులపై అటువంటి సూచన అందిన తేదీ నుండి మూడు నెలల వ్యవధిలోపు రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలని నిర్దేశిస్తున్నాము” అని అత్యున్నత న్యాయస్థానం ప్రకటించింది. 
ఏదైనా జాప్యం జరిగితే రాష్ట్రపతి భవన్ అందుకు కారణాలను రాష్ట్రాలకు వివరించాలని, నిర్దేశిత గడువులోగా రాష్ట్రపతి నుంచి స్పందన లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు మాండమస్ రిట్ పిటిషన్ దాఖలు చేయవచ్చని సుప్రీంకోర్టు సూచించింది.

“గవర్నర్ ఒక బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు రిజర్వ్ చేస్తే, రాష్ట్రపతి దానికి అనుమతి ఇవ్వకపోతే, ఈ కోర్టు ముందు అటువంటి చర్యను సవాలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది” అని బెంచ్ స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం, గవర్నర్‌కు అనుమతి ఇవ్వడానికి లేదా నిలిపివేయడానికి లేదా రాష్ట్రపతి పరిశీలన కోసం బిల్లును రిజర్వ్ చేయడానికి అధికారం ఉంది.
 
“ఈ బిల్లులు, గవర్నర్ వద్ద చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయి.  గవర్నర్ బిల్లులను రాష్ట్రపతి పరిశీలన కోసం రిజర్వ్ చేయడంలో స్పష్టమైన నిజాయితీ లేకపోవడంతో వ్యవహరించారు” అంటూ గవర్నర్ చర్యలపై అసహనం వ్యక్తం చేశారు. 

కాగా, గవర్నర్ తొక్కిపెట్టిన 10 బిల్లులకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పది చట్టాలను నోటిఫై చేసింది. ఇందుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం 10 చట్టాలను నోటిఫై చేయడం రాజ్యంగ చరిత్రలో ఇదే మొదటిసారి. 

శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ సమ్మతించక పోవడం, పునఃపరిశీలనకు కూడా పంపకపోవడంపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, గవర్నర్ తీరును అత్యున్నత న్యాయస్థానం తప్పుపడుతూ ఆ 10 బిల్లులకు మార్చి 8న క్లియరెన్స్ ఇచ్చింది.