ప్రతిపక్షాలకు కుటుంబ ప్రయోజనాలే ముఖ్యం

ప్రతిపక్షాలకు కుటుంబ ప్రయోజనాలే ముఖ్యం
అధికారాన్ని కోరుకునేవారు తమ సొంత కుటుంబాల వృద్ధిపైనే దృష్టి పెడతారని, తమ ప్రభుత్వం మాత్రం సమ్మిళిత అభివృద్ది కోసమే పని చేస్తోందని విపక్షాలను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యలు చేశారు. ఉత్తర్​ప్రదేశ్​లోని సొంత నియోజకవర్గమైన వారణాసిలో పర్యటించిన ప్రధాని, అక్కడ రూ.3,880కోట్ల విలువైన 44 గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. 
 
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగించిన ప్రధాని మోదీ ప్రతిపక్ష పార్టీలపై ఈ మేరకు విమర్శలు చేశారు. “దేశానికి సేవ చేయడంలో మా ప్రభుత్వం సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌ మంత్రంతో ముందుకు సాగుతోంది. కానీ అధికారం దాహం కోసం ఆరాటపడే వారు రాత్రి, పగలు రాజకీయ ఆటలు ఆడుతున్నారు. జాతీయ ప్రయోజనాలకు కాకుండా కుటుంబాల అభివృద్ధిపైనే దృష్టి పెడుతున్నారు” అని విమర్శించారు. 
 
“ప్రతిపక్షాలు పరివార్​ కా సాథ్ పరివార్​ కా వికాస్​ అనే మంత్రంతోనే వ్యవహరిస్తున్నారు. ఈ రోజున భారత్​ అభివృద్ధి, వారసత్వం అనే రెండింటితో కలిసి ముందుకు సాగుతోంది. అందుకు కాశీనే ఒక ఉదాహరణగా మారుతోంది. ఇక ఆయుష్మాన్‌ భారత్‌తో పేదలు అప్పులు చేయకుండా మెరుగైన వైద్యం లభిస్తోంది” అని ప్రధాని తెలిపారు.
 
“మరోవైపు యువతకు క్రీడా రంగంలో వృద్ధి అవకాశాలను అందించడానికి మా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి మేము మా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాము. కానీ ఒలింపిక్స్‌లో మెరవాలంటే, యువత ఈరోజే నుంచే శిక్షణ ప్రారంభించాలి’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ప్రధాని మోదీ ప్రారంభించిన ప్రాజెక్టుల్లో 130 తాగునీరు, 100 అంగన్వాడీ కేంద్రాలు, 356 లైబ్రరీలు, పాలిటెక్నిక్‌ కాలేజీ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రోడ్లు, హాస్టళ్ల ఉన్నట్లు వారణాసి డివిజనల్ కమిషనర్ కౌశల్ రాజ్ శర్మ తెలిపారు. అంతేకాకుండా ముగ్గురు వృద్ధులకు ఆయుష్మాన్‌ కార్డులు, పాడిరైతులకు బోనస్‌లు అందజేశారు.

అంతకుముందు వారణాసిలో దిగగానే అక్కడ 19 ఏళ్ల యువతిపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటనపై పోలీసు కమిషనర్‌, డివిజనల్‌ కమిషనర్‌తో పాటు జిల్లా మెజిస్ట్రేటుతో ఆరా తీశారు. నిందితులపై సాధ్యమైనంత కఠినమైన చర్యలు తీసుకోవాలని, మరోసారి ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని వారికి ప్రధాని సూచించారు.

వార‌ణాసిలో ఓ 19 ఏళ్ల అమ్మాయిని ఇటీవ‌ల 23 మంది ఆరు రోజుల పాటు సామూహికంగా అత్యాచారానికి పాల్ప‌డ్డారు. బాధితురాలికి మ‌త్తు ఇచ్చి .. అనేక హోట‌ళ్లు తిప్పిన‌ట్లు విచార‌ణ‌లో తేలింది. సోమ‌వారం నాటికి ఈ కేసుతో లింకున్న ఆరు మందిని అరెస్టు చేశారు.