
ట్రంప్కు వ్యతిరేకంగా వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. ట్రంప్, ఎలాన్ మస్క్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరుగుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రభుత్వ సలహాదారు, డోజ్ అధిపతి ఎలాన్ మస్క్ విధానాలకు వ్యతిరేకంగా అమెరికన్లు గర్జించారు. ‘హ్యాండ్సాఫ్’ పేరుతో పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగారు.
దేశంలోని 50 రాష్ర్టాల్లో దాదాపు 1400 చోట్ల భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. దాదాపు మూడు నెలల కిందట అమెరికా అధ్యక్షుడిగా మరోసారి బాధ్యతలు స్వీకరించిన ట్రంప్.. స్వల్ప సమయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపారు. ప్రభుత్వ ఉద్యోగులకు కోత పెట్టారు. ప్రపంచ దేశాలతో వాణిజ్య యుద్ధానికి తెరలేపారు.
ఈ క్రమంలో ట్రంప్ దుందుడుకు నిర్ణయాలను నిరసిస్తూ ప్రజలు ఆందోళనకు దిగారు. 2017లో మహిళల నిరసన, 2020లో బ్లాక్ లైవ్స్ మ్యాటర్స్ ఆందోళనల తర్వాత ఇంత పెద్దయెత్తున నిరసనలు జరగడం ఇదే తొలిసారి. ‘ట్రంప్ గో బ్యాక్’, ‘హ్యాండ్స్ ఆఫ్ డెమోక్రసీ’, ‘మస్క్ వాజ్ నాట్ ఎలెక్టెడ్’ వంటి నినాదాలతో వాషింగ్టన్ డిసి, న్యూయార్క్, షికాగో, మయామీ వంటి నగరాల్లో నిస్టేట్ క్యాపిటల్ భవనాలు, ఫెడరల్ కార్యాలయాల వద్ద వారు ఆందోళనలు చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా స్టేట్ క్యాపిటల్స్, ఫెడరల్ బిల్డింగ్స్, కాంగ్రెసెనల్ ఆఫీసులు, సోషల్ సెక్యూరిటీ హెడ్క్వార్టర్లు, పార్కులు తదితర చోట్ల ప్రజలు ఆందోళన చేపట్టారు. బిలియనీర్ల పెత్తనానికి చెక్ పెట్టాలని, ప్రభుత్వంలో అవినీతికి ముగింపు పలకాలని, మెడిక్ఎయిడ్, సామాజిక భద్రత పథకాలకు నిధుల కోతను ఆపాలని, వలసదారులు, ట్రాన్స్జెండర్లు, ఇతర కమ్యూనిటీలపై దాడులను ఆపాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.
ప్రభుత్వ ఉద్యోగులు, సామాజిక భద్రతా పథకాలకు కోత పెట్టడంపై సియాటిల్ నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ట్రంప్ను అభిశంసించాలి.. మస్క్ను బహిష్కరించాలి’ అన్న ప్లకార్డులను అట్లాంటాలో ఆందోళనకారులు ప్రదర్శించారు. బోస్టన్లో ‘హ్యాండ్సాఫ్ అవర్ డెమొక్రసీ’, ‘హ్యాండ్సాఫ్ అవర్ సోషల్ సెక్యూరిటీ’ అని రాసి ఉన్న ప్లకార్డులను చేతబట్టి ట్రంప్నకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినదించారు.
లేబర్ యూనియన్లు, ఎల్బీజీటీక్యూ కార్యకర్తలు, న్యాయవాదులు, వయోజనులు, వృద్ధులు, ఎలక్షన్స్ యాక్టివిస్ట్లు సహా 150కి పైగా గ్రూపులు ఈ ‘హ్యాండ్సాఫ్’ ఆందోళనను నిర్వహించాయి. అయితే దేశవ్యాప్తంగా ఈ ర్యాలీలు శాంతియుతంగానే జరిగాయని, ఎలాంటి అరెస్టలు చోటుచేసుకోలేదని అధికార వర్గాలు తెలిపాయి.
ఈ దేశవ్యాప్త నిరసనలపై శ్వేత సౌధం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘ట్రంప్ వైఖరి స్పష్టంగా ఉంది. అర్హత కలిగిన లబ్ధిదారులకు సామాజిక భద్రత, మెడికేర్, మెడికెయిడ్ను అందించడానికి ఆయన కట్టుబడి ఉన్నారు. ఇంతకాలం డెమోక్రాట్ల పాలనలో వాటి ద్వారా చాలామంది అక్రమార్కులు లబ్ధి పొందారు’ అని పేర్కొంది.
More Stories
భారత్కు నష్టం కలిగించారనే ఒక్క ఫొటో చూపించగలరా?
1977లో ఓటమి భయంతో ఆర్ఎస్ఎస్ చెంతకు ఇందిరా గాంధీ!
వామపక్ష తీవ్రవాదంపై మహారాష్ట్ర కఠిన బిల్!