బిజెపి సంస్థాపన దినోత్సవంకు పవన్ శుభాకాంక్షలు

బిజెపి సంస్థాపన దినోత్సవంకు పవన్ శుభాకాంక్షలు

“అంధకారం అస్తమిస్తుంది. సూర్యుడు ఉదయిస్తాడు. కమలం వికసిస్తుంది”.. సరిగ్గా 45 ఏళ్ల క్రితం భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున అటల్ బిహారి వాజ్ పేయి ప్రసంగంలో మాటలు ఇవి. 1980, ఏప్రిల్ 6న  అటల్ బిహారి వాజ్‌ పేయి, ఎల్ కె అద్వాని ఆధ్వర్యంలో బీజేపీ అవతరించింది. అప్పుడు ఇద్దరు ఎంపీలతో మొదలైన బీజేపీ, ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీగా ఆవిర్భవించింది.

ఈ నేపథ్యంలో జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా భారతీయ జనతా పార్టీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కార్యకర్తలు, నేతలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. “భారతీయ జనతా పార్టీ 46వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నాయకులకు హృదయపూర్వక శుభాకాంక్షలు” అని చెప్పారు.
 
ఎన్డీయేలో జనసేన భాగస్వామ్య పార్టీ కాగా, ఏపీలో టిడిపి నేతృత్వంలోని కూటమిలో బిజెపి చేరడంలో, ఉమ్మడిగా ప్రభుత్వం ఏర్పాటులో పవన్ కళ్యాణ్ కీలక భూమిక వహించారు.  “చారిత్రాత్మక ఉద్యమం ద్వారా బీజేపీ పార్టీ పుట్టింది. మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయి, ఎల్ కే అద్వానీ లాంటి నేతలు ప్రజాస్వామ్య భారత్ కోసం పార్టీ స్థాపనకు కృషి చేశారు. దేశానికి సేవ చేయాలని ఆ మహనీయులు స్థాపించిన పార్టీ ఇప్పుడు కోట్ల మంది ఆశయాలను నెరవేరుస్తోంది” అని కొనియాడారు.

“ఈరోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల కృషి వల్ల ప్రపంచంలోనే బీజేపీ అతిపెద్ద రాజకీయ పార్టీగా ఆవిర్భవించింది. దేశంలో మూడు పర్యాయాలుగా ప్రజలకు సేవలు అందిస్తోంది. ఈ చరిత్రాత్మక సందర్భంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అలాగే రాష్ట్రంలోని బీజేపీ కార్యకర్తలు, నాయకులకు శుభాకాంక్షలు చెబుతున్నా” అని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.