వక్ఫ్ బిల్లు ముస్లింల విశ్వాసాలకు ఎలాంటి ఆటంకం కలిగించదు

వక్ఫ్ బిల్లు ముస్లింల విశ్వాసాలకు ఎలాంటి ఆటంకం కలిగించదు
* కొందరు పార్లమెంట్ భవనాన్ని కూడా వక్ఫ్‌ ఆస్తిగా పేర్కొంటారు
 
వక్ఫ్ బిల్లు ముస్లిం సమాజానికి, వారి మత విశ్వాసాలకు ఎలాంటి ఆటంకం కలిగించదని కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు స్పష్టం చేశారు.  : వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ బిల్లు 2025ని లోక్‌స‌భ‌లో బుధవారం ప్రవేశపెడుతూ ఇది కేవలం వక్ఫ్​ ఆస్తుల నిర్వహణకు సంబంధించిన అంశం మాత్రమే అని పేర్కొంటూఈ బిల్లుకు మద్దతు ఇచ్చేవారు, వ్యతిరేకించేవారు ఎప్పటికీ గుర్తుండిపోతారని చెప్పారు.

“మేం బిల్లులో కొన్ని సానుకూల మార్పులు చేస్తే, మమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తున్నారు? ఈ బిల్లు తీసుకురాకపోతే, కొందరు పార్లమెంట్ భవనాన్ని కూడా వక్ఫ్‌ ఆస్తిగా పేర్కొంటారు” అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ స్పందనకు గతంలో ఏఐయూడీఎఫ్ చీఫ్ బద్రుద్దీన్‌ అజ్మల్ చేసిన వ్యాఖ్యలే కారణం. దేశ రాజధానిలోని పార్లమెంట్ భవనం, దాని పరిసర ప్రాంతాలు వక్ఫ్ ఆస్తికి సంబంధించినవని అజ్మల్ అప్పట్లో వాదించారు.

వ‌క్ఫ్ అంశాన్ని మ‌త‌ప‌ర‌మైన కోణంలో కాకుండా, ప్రాప‌ర్టీ కోణంలో చూస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. రైల్వేలు, ర‌క్ష‌ణ రంగం త‌ర్వాత దేశంలో అత్య‌ధిక భూములు ఉన్న‌ది వ‌క్ప్ బోర్డు వ‌ద్దే అని మంత్రి చెప్పారు. అతిపెద్ద సంఖ్య‌లో భూములు ఉన్నా గ‌డిచిన 70 ఏళ్ల నుంచి ఓటు బ్యాంకు రాజ‌కీయాల కోసం ముస్లింల‌కు ఆ భూముల నుంచి ల‌బ్ధి అంద‌కుండా చేశార‌ని ఆయ‌న ఆరోపించారు.

వ‌క్ఫ్ ప్రాప‌ర్టీల‌ను సాధార‌ణ‌, పేద‌, అణ‌గారిన ముస్లింల సంక్షేమం, ల‌బ్ధి కోసం ఎందుకు వాడ‌టంలేద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. సాధార‌ణ ముస్లింల సంక్షేమం కోసం వ‌క్ఫ్ ప్రాప‌ర్టీల‌ను వాడాల్సిన సంద‌ర్భం వ‌చ్చింద‌ని స్పష్టం చేశారు. 2004 లెక్కల ప్ర‌కారం. దేశంలో 4.9 ల‌క్ష‌ల వ‌క్ఫ్ ప్రాప‌ర్టీలు ఉన్నాయ‌ని, వాటి నుంచి వ‌స్తున్న ఆదాయం రూ. 163 కోట్లుగా పేర్కొన్నారు. 

అయితే 2013లో వ‌చ్చిన స‌వ‌ర‌ణ త‌ర్వాత ఆ ప్రాప‌ర్టీల ఆదాయం రూ. 3 కోట్లు పెరిగింద‌ని, అంటే వ‌క్ప్ ఆదాయం 166 కోట్ల‌కు చేరింద‌ని చెప్పారు.  అంత భారీగా ఉన్న ప్రాప‌ర్టీల నుంచి త‌క్కువ స్థాయిలో ఆదాయం వ‌స్తోంద‌ని, ఆ ప్రాప‌ర్టీల నుంచి క‌నీసం రూ. 12 వేల కోట్ల ఆదాయం రావాల‌ని మంత్రి రిజిజు పేర్కొన్నారు. ఎవ‌రి ప్రాప‌ర్టీని లాక్కోవ‌డం లేద‌ని స్పష్టం చేశారు. 

ప్రస్తుతం వక్ఫ్ చట్టంలోని పలు క్రూరంగా పరిగణించే అంశాలను తమ ప్రభుత్వం తొలగించిందని చెబుతూ దక్షిణ భారతంలోని పలు రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటకలోని పలు దేవాలయాలతోపాటు హర్యానాలోని వివిధ గురుద్వార్‌లను ముస్లిం సమాజం వక్ఫ్ భూమిగా క్లయిమ్ చేసిందని రిజిజు ఈ సందర్భంగా వివరించారు

2019లో పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ బిల్లును తెచ్చిన‌ప్పుడు విప‌క్షాలు గ‌గ్గోలు పెట్టాయ‌ని, కానీ ఒక్క ముస్లిం కూడా త‌మ హ‌క్కుల్ని కోల్పోలేద‌ని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. ముస్లింల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించిన విప‌క్షాలు దేశ ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ చెప్పాల‌ని ఆయన డిమాండ్ చేశారు.  వ‌క్ఫ్ బిల్లును ఇక నుంచి యునిఫైడ్ వ‌క్ఫ్ మేనేజ్మెంట్ ఎంప‌వ‌ర్మెంట్‌, ఎఫిషియ‌న్సీ అండ్ డెవ‌ల‌ప్మెంట్ బిల్లుగా పిల‌వ‌నున్న‌ట్లు మంత్రి రిజిజు తెలిపారు. 

దేశంలో ప్ర‌స్తుతం 8.72 ల‌క్ష‌ల వ‌క్ప్ ప్రాప‌ర్టీలు ఉన్న‌ట్లు మంత్రి చెప్పారు. ఆ ప్రాప‌ర్టీల‌ను స‌క్ర‌మంగా వినియోగిస్తే ముస్లింలే కాదు, దేశ ప‌రిస్థితే మారేద‌ని పేర్కొన్నారు. మ‌రో ఏడాదిలో కొత్త వ‌క్ఫ్‌ బిల్లుతో భారీ మార్పు రానున్న‌ట్లు చెప్పారు. అందుకే పేద ముస్లింలు వ‌క్ఫ్ బిల్లును మ‌న‌స్పూర్తిగా స్వాగ‌తిస్తున్నార‌ని మంత్రి వెల్ల‌డించారు.

ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలతో ముస్లిం మహిళలు, పిల్లలకు వారి హక్కులు దక్కుతాయని చెప్పారు. ప్రభుత్వ భూమి విషయంలో వివాదం తలెత్తితే కలెక్టర్ కంటే పైస్థాయి వ్యక్తి తీర్పు ఇవ్వాలంటూ జేపీసీ చేసిన ప్రతిపాదనను తాము అంగీకరించామని గుర్తు చేశారు.

“బిల్లు గురించి విపక్ష పార్టీలు అసత్య ప్రచారం చేస్తున్నాయి. సవరణ బిల్లులోని అంశాలను లేవనెత్తి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. 1954లో తొలిసారి వక్ఫ్‌ చట్టం అమల్లోకి వచ్చింది. అది అప్రజాస్వామికం అని ఆనాడు ఎవరూ చెప్పలేదు” అని కేంద్ర మంత్రి విమర్శించారు. పార్లమెంట్ ఉభయ సభల సభ్యులతో కూడిన జేపీసీకి అభినందనలు తెలుపుతూ మొత్తం 284 ప్రతినిధులు, 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వక్ఫ్ బోర్డులు జేపీసీలో తమ వాదనలు వినిపించాయని చెప్పారు.