హెచ్ సీయూ భూముల వేలంపై వాదోపవాదాలు

హెచ్ సీయూ భూముల వేలంపై వాదోపవాదాలు
ప్రభుత్వం వేలం వేయాలనుకుంటున్న కంచ గచ్చిబౌలి భూములపై ప్రభుత్వం, యూనివర్సిటీల మధ్య వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. రాత్రి పగలు తేడా లేకుండా దాదాపు 50 ఎక్స్‌కవేటర్లతో ఆ భూములను చదును చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం ముమ్మరంగా చేస్తుంటే, ఆ భూములు వర్సిటీవేనని, వాటిని తమకు అప్పగించాలంటూ యూనివర్సిటీ అఫ్ హైదరాబాద్‌ (హెచ్‌సీయూ) విద్యార్థులు ఆందోళన తీవ్రం చేస్తున్నారు. 
 
ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకూ చదును చేసే కార్యక్రమాలను అడ్డుకున్న విద్యార్థులు.. సోమవారం వివిధ రాజకీయ పార్టీలను ఆశ్రయించారు. వారికి బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు మద్దతు పలికాయి. వేలాన్ని ప్రభుత్వం వెంటనే నిలిపి వేయాలని డిమాండ్‌ చేశాయి. ఈ నేపథ్యంలోనే, ఆ భూములు ప్రభుత్వానివేనంటూ తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (టీజీఐఐసీ) ఆధారాలను బయటపెట్టింది. సోమవారం ఉదయం, సాయంత్రం రెండు ప్రకటనలను విడుదల చేసింది.
 
 ప్రస్తుతం వివాదం నెలకొన్న భూములను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి హెచ్‌సీయూ స్వాధీనం చేసిందని, దానికి బదులుగా వర్సిటీకి సర్కారు 397 ఎకరాలను బదలాయించిందని స్పష్టం చేసింది. దీనిపై అప్పటి వర్సిటీ రిజిస్ట్రార్‌ సంతకం చేశారని తెలిపింది. సంబంధిత కాపీలను ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) విడుదల చేసింది. 
 
అయితే, కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనంటూ టీజీఐఐసీ చేసిన ప్రకటనను హెచ్‌సీయూ రిజిస్ట్రార్‌ ఖండించారు. 400 ఎకరాల భూమిని గుర్తించేందుకు యూనివర్సిటీ క్యాంపస్ లో రెవెన్యూ అధికారులు జూలై 2024లో ఎలాంటి సర్వే నిర్వహించలేదని స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాలపై యాజమాన్యం తమదేనని కోర్టులో సాధించిన విజయంతో ఆ భూములు ప్రభుత్వ పరం అయ్యాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసిన కొద్దిసేపటికే రిజిస్ట్రార్ ఈ ప్రకటన చేశారు.
సర్వే నిర్వహణ విషయంలో టీజీ ఐసీసీ జోనల్ మేనేజర్ 2024 జులై 18న యునివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రిజిస్ట్రార్ కు registrar@uohyd.ac.in కు మెయిల్ చేశారని, హెచ్ సీయూ రిజిస్ట్రార్ సమ్మతితోనే 2024 జూలై 19న యూనివర్సిటీ అధికారులు, యూనివర్సిటీ రిజిస్ట్రార్, యూనివర్సిటీ ఇంజనీర్, యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, రెవెన్యూ అధికారులు, రెవెన్యూ ఇన్ స్పెక్టర్, మండల సర్వేయర్ సమక్షంలో సర్వే నిర్వహించి అదే రోజున హద్దులు నిర్ధారించినట్లు ప్రభుత్వం తెలిపింది. 

అయితే ప్రభుత్వం చేసిన ఈ ప్రకటనను తాజాగా హెచ్ సీయూ రిజిస్ట్రార్ తోసిపుచ్చారు. ఇప్పటి వరకు కేవలం భూమి ప్రాథమిక పరిశీలన మాత్రమే జరిగిందని పేర్కొన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎటువంటి స‌ర్వే జ‌ర‌గ‌లేద‌ని తేల్చి చెప్పింది. ఇటీవల పత్రికల్లో వచ్చిన టీజీఐఐసీ ప్రకటనను కూడా యూనివర్సిటీ ఖండించింది.

యూనివర్సిటీకి కేటాయించిన భూమి ఏదైనా బదిలీ జరగాలంటే అది యూనివర్సిటీ కార్యనిర్వాహక మండలి అధికారిక సమ్మతితోనే జరుగుతుంద‌ని తేల్చి చెప్పింది. ఇప్ప‌టి వ‌ర‌కు భూములు బ‌ద‌లాయింపుపై ఎటువంటి నిర్ణ‌యం యూనివర్సిటీ కార్యనిర్వాహక మండలి తీసుకోలేద‌ని రిజిస్ట్రార్ త‌న ప్ర‌క‌ట‌నలో తెలిపారు. ఈ విషయంలో యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ స్టేక్ హోల్డర్స్, మీడియా ప్రతినిధులు యూనివర్సిటీ ధృవీకరించని ఏ సమాచారన్ని వ్యాప్తి చేయండం, ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు.

మరోవంక, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన లేఖను బయటపెట్టింది. 2004లోనే ఆ భూమిని ప్రభుత్వానికి హెచ్ సీయూ అప్పగించినట్లు లేఖలో పేర్కొంది. ఆ డాక్యుమెంట్‌పై అప్పటి రిజస్ట్రార్‌ నరసింహులు సంతకం కూడా ఉంది. 534.28 గుంటల భూమిని ప్రభుత్వానికి అధికారులు అప్పగించినట్లు లేఖలో ఉంది. అందుకు ప్రతిగా గోపనపల్లి గ్రామంలో సర్వే నెంబర్‌ 36లో 191, సర్వే నెంబర్‌ 37లో 205 ఎకరాలను ప్రభుత్వం కేటాయించినట్లు లేఖలో పేర్కొంది.

కంచ గచ్చిబౌలిలో వేలానికి ప్రతిపాదించిన 400 ఎకరాల్లో ఒక్క అంగుళం కూడా హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయ (హెచ్‌సీయూ) భూమి లేదని.. ఆ భూమిపై పూర్తి యాజమాన్య హక్కు తనదేనని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయినా.. కొంత మంది రాజకీయ నాయకులు, స్థిరాస్తి వ్యాపారులు స్వప్రయోజనాల కోసం విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించింది. ఆ భూమికి యజమాని ప్రభుత్వమేనని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తు చేసింది. దానిపై ఎలాంటి వివాదానికి పాల్పడినా కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని హెచ్చరించింది.