ఇతర దేశాల్లో కూడా శ్రీవారి ఆలయాలు

ఇతర దేశాల్లో కూడా శ్రీవారి ఆలయాలు

మన దేశంలోనే కాక ఇతర దేశాల్లో కూడా శ్రీవారి ఆలయాలను నిర్మించాలని  టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. శ్రీవాణి ట్రస్టుతో పాటు నూతనంగా ఏర్పాటు చేయబోయే మరో ట్రస్టు ద్వారా వచ్చే విరాళాలతో ఈ ఆలయాలను నిర్మిస్తారు. శ్రీవారి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ప్రత్యేకంగా కమిటీని నియమించాలని సోమవారం జరిగిన టిటిడి పాలకమండలి సమావేశంలో నిర్ణయించారు. 

2025-26వ సంవత్సరం వార్షిక బడ్జెట్‌‌ను రూ.5258.68 కోట్లతో పాలకమండలి ఆమోదం తెలిపింది. పాలకమండలిలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు.  దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాలు నిర్మించాలని నిర్ణయించారు. ఇప్పటికే పలువురు ముఖ్యమంత్రులు ఆలయ నిర్మాణాలకు ఆమోదం తెలిపారు. ఏపీలో పలు చోట్ల నిలిచిపొయిన దేవాలయాలను పునర్ నిర్మించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు,

ముంతాజ్ హోటల్ నిర్మాణానికి వేరేచోట భూమి కేటాయించాలని సీఎం చంద్రబాబు టీటీడీని ఆదేశించడంతో అలిపిరి వద్ద ఉన్న 35.24 ఎకరాలతో పాటు 15ఎకరాల టూరిజం భూమిని టీటీడీ స్వాధీనం చేసుకొని, ప్రత్యామ్నాయంగా 50 ఎకరాల భూమిని మరో ప్రదేశంలో ప్రభుత్వానికి కేటాయించాలని నిర్ణయించారు. సైన్స్ సిటీకి టీటీడీ కేటాయించిన 20 ఏకరాల స్థలాలను రద్దు చేశారు.

శ్రీవారి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ప్రత్యేకంగా కమిటీని నియమిస్తున్నామని బిఆర్ నాయుడు ప్పారు. శ్రీవారి ఆస్తులకు సంబంధించి న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నామని, టీటీడీలో అన్యమత ఉద్యోగస్తులను తొలగిస్తామని ప్రకటించారు.
పోటు కార్మికులకు జీఎస్టీ భారం లేకుండా జీతం రూ.43 వేలు చెల్లించేలా నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ ఉద్యోగులకు మూడు నెలలకు ఒక్కసారి సుపథం ద్వారా దర్శనం కల్పిస్తామని ప్రకటించారు. లైసెన్స్ లేని హ్యాకర్ల నిర్మూలనకు రెవెన్యూ, విజిలెన్స్ శాఖ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. టీటీడీ ఉద్యోగుల నేమ్ బ్యాడ్జ్‌లు ఏర్పాటుపై అధ్యయనం చేశామని తెలిపారు. 

వీఐపీ బ్రేక్ దర్శనాలు గతంలో మాదిరిగానే ఉదయం 6 గంటలకు ప్రారంభించాలని సూచించామని చెప్పారు. తిరుపతి గంగమ్మ, తలకోన, కర్నూల్ జిల్లాలో బుగ్గ, అనకాపల్లిలోని ఉపమాక, ధర్మవరం, తెలంగాణలోని కొడంగల్, సికింద్రాబాద్, కరీంనగర్‌లలో నూతనంగా ఆలయాలు నిర్మిస్తున్నామని ప్రకటించారు. 180 మంది కాంట్రాక్టు లెక్చరర్‌లకు జీత భత్యాల పెంపుపై కమిటీ వేశారు.

వికలాంగులు, వృద్ధులకు అఫ్‌లైన్‌లో టికెట్స్ జారీపై కూడా కమిటీ వేశారు. పాత ఆగమ సలహా మండలిని రద్దు చేశారు. త్వరలోనే నూతన కమిటీని నియమిస్తామని ప్రకటించారు. శ్రీనివాసం స్పోర్ట్స్ కాంప్లెక్స్ అభివృద్ధికి కోటి రూపాయలు నిధులు మంజూరు చేశారు. గూగుల్ సంస్థ ద్వారా తిరుమల కార్యకలాపాల్లో అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగిస్తున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పేర్కొన్నారు.