షిండేపై కమెడియన్‌ అనుచిత వ్యాఖ్యలు

షిండేపై కమెడియన్‌ అనుచిత వ్యాఖ్యలు
* భగ్గుమన్న శివసేన కార్యకర్తలు
 
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండేపై స్టాండప్‌ కమెడియన్‌ కునాల్‌ కమ్రా చేసిన స్కిట్‌ తీవ్ర వివాదాస్పదమైంది. కామెడీ షోలో షిండేను దేశ ద్రోహిగా పేర్కొంటూ ఓ పాట కూడా పాడారు. దీంతో మహా రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. కమ్రాపై శివసేన నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
 
కమెడియన్‌ వ్యాఖ్యలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కామెడీ పేరుతో ఇతరులను అగౌరవపరచడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. కమ్రా తీరును తీవ్రంగా ఖండించారు. “నేను హాస్యానికి వ్యతిరేకం కాదు. అయితే ఆ పేరుతో ఇతరులను అగౌరవపరచడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఇలాంటి దిగజారుడు హాస్యం, డిప్యూటీ సీఎంను అగౌరవపరచడం సరికాదు. ఈ వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలి” అని ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు.

ఖార్‌ ప్రాంతంలోని హాబిటాట్‌ కామెడీ క్లబ్‌లో కునాల్‌ కమ్రా షో జరిగింది. షోలో భాగంగా కమ్రా మహా రాజకీయాల గురించి మాట్లాడారు. ముఖ్యంగా ఉపముఖ్యమంత్రి ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన ఓ దేశ ద్రేహి అని పేర్కొన్నారు. 

 “శివసేన నుంచి శివసేన బయటికి వచ్చింది. ఎన్సీపీ నుంచి ఎన్సీపీ విడిపోయింది. అంతా గందరగోళంగా ఉంది” అంటూ మహారాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడారు. అక్కడితో ఊరుకోకుండా ఆ కమెడియన్‌ ఏక్‌నాథ్‌ షిండేను ద్రోహిగా అభివర్ణించారు. ఈ సందర్భంగా ‘దిల్‌ తో పాగల్‌ హై’ అనే హిందీ పాటలోని చరణాలను రాజకీయాలకు అనుగుణంగా మార్చి అవమానకర రీతిలో పాడారు.

ఇందుకు సంబంధించిన వీడియోను శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్‌ రౌత్‌ ఎక్స్‌లో పోస్టు చేస్తూ ‘కునాల్‌ కా కమల్‌’ అంటూ ఎద్దేవా చేశారు. దీంతో ఈ అంశం కాస్తా వివాదాస్పదమైంది. కమెడియన్‌పై శివసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు షో జరిగిన హోటల్‌పై దాడి చేశారు. కమ్రా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ దాడికి పాల్పడ్డారు. అప్రమత్తమైన పోలీసులు ఈ దాడికి నేతృత్వం వహించిన శివసేన నేత రాహుల్ కనాల్‌ను  అదుపులోకి తీసుకున్నారు. మరో 40 మంది కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. 

మరోవైపు డిప్యూటీ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కమెడియన్‌పై శివసేన కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కమ్రాపై కేసు నమోదు చేసి 12 మందిని అరెస్ట్ చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో తమ క్లబ్‌ను మూసివేస్తున్నట్లు హాబిటాట్‌ స్టూడియో ప్రకటించింది. కాగా, ది హాబిటాట్ స్టూడియోలో జరిగిన విధ్వంసానికి సంబంధించి అరెస్టయిన 12 మంది వ్యక్తులకు ఆదివారం బాంద్రాలోని మేజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వీరిలో శివసేన (షిండే వర్గం) నాయకుడు రాహుల్ కనాల్ కూడా ఉన్నారు.

మరోవైపు ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కూడా దీనిపై అసహనం వ్యక్తం చేశారు. రాజ్యాంగ నియమాలకు వ్యతిరేకంగా ఎవరకూ ప్రవర్తించకూడదని, రాజ్యాంగం కల్పించిన హక్కులకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు. అంతేకాక చట్టం పరిధి దాటి ఎవరు వ్యవహరించకూడదని హెచ్చరించారు.

కునాల్ కమ్రా వ్యాఖ్యలపై ఆందోళనల నేపథ్యంలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ బీఎంసీ అధికారులు కామెడీ షో జరిగిన హోటల్‌ అక్రమ నిర్మాణమని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఖార్‌లోని స్టూడియోకు సుత్తితో చేరుకుని కూల్చివేతను చేపట్టారు. స్టూడియో ప్రాంగణం రెండు హోటళ్ల మధ్య ఆక్రమణ ప్రాంతంలో ఉందని అధికార వర్గాలు తెలిపాయి.