అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి తీర్పుపై కేంద్ర మంత్రి ఆగ్రహం

అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి తీర్పుపై కేంద్ర మంత్రి ఆగ్రహం
అలహాబాద్‌ హైకోర్టు జడ్జి రామ్‌ మనోహర్‌ మిశ్రా ఇచ్చిన తీర్పు ఇప్పుడు దేశవ్యాప్త చర్చకు దారి తీసింది. మహిళ రొమ్ము పట్టుకుని ఆమె పైజామా బొందు లాగి తెంచేయడం అత్యాచారం లేదా అత్యాచార యత్నం కాదంటూ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా ఇచ్చిన తీర్పును కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణా దేవి తీవ్రంగా ఖండించారు. 
 
శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆమె ఇది తప్పుడు తీర్పని స్పష్టం చేశారు. ఇలాంటి తీర్పు సమాజానికి తప్పుడు సందేశాన్ని పంపుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తీర్పును పరిశీలించాలని ఆమె సుప్రీంకోర్టును కోరారు.

కాగా, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి ఇచ్చిన ఈ వివాదస్పద తీర్పుపై పలు పార్టీలకు చెందిన మహిళా ఎంపీలు, నాయకురాళ్లు స్పందించారు. “చాలా దురదృష్టకరం. తీర్పులో చేసిన వ్యాఖ్యల పట్ల నేను చాలా దిగ్భ్రాంతికి గురయ్యా. ఇది చాలా అవమానకరమైన దృష్టాంతం” అని  ఆప్‌ ఎంపీ, ఢిల్లీ మహిళా కమిషన్‌ మాజీ చీఫ్‌ స్వాతి మలివాల్ విమర్శించారు.

“ఆ వ్యక్తులు చేసిన చర్యను అత్యాచారానికి పాల్పడే చర్యగా ఎందుకు పరిగణించడం లేదు? ఈ తీర్పు వెనుక ఉన్న లాజిక్ నాకు అర్థం కావడం లేదు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది” అని ఆమె స్పష్టం చేశారు.

మరోవైపు దేశంలో మహిళలను పూర్తిగా నిర్లక్ష్యం చేసే విధానం చాలా అసహ్యంగా ఉందని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ జూన్ మాలియా విమర్శించారు. దీనిని మనం అధిగమించాల్సిన అవసరం ఉందని ఆమె తెలిపారు. ప్రముఖ మహిళా న్యాయవాది ఇందిరా జైసింగ్ కూడా ఈ తీర్పుపై స్పందిస్తూ సుప్రీంకోర్టు సుమోటోగా దీనిని స్వీకరించాలని ఎక్స్‌ పోస్ట్‌లో కోరారు.

2021 నవంబరులో.. ఉత్తరప్రదేశ్‌లోని కసగంజ్‌ ప్రాంతానికి చెందిన ఓ మైనర్‌ బాలికపై లిఫ్ట్‌ ఇస్తామని చెప్పి అత్యాచారానికి యత్నఇంచారు. ఆ బాలికను బైక్‌పై తీసుకెళ్లిన యువకులు ఆమెను అసభ్యంగా తాకుతూ వేధింపులకు గురిచేశారు. బాలిక అరుపులు విని అటుగా వెళ్తున్నవారు రావడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. 

 
విషయం తెలుసుకున్న బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో నిందితులపై కేసు నమోదు చేశారు. అనంతరం ఈ కేసు అలహాబాద్‌ హైకోర్టుకు చేరింది. ఇటీవల దీనిపై విచారణ జరిపిన జస్టిస్‌ రామ్‌ మనోహర్‌ నారాయణ్‌ మిశ్రా మహిళ ఛాతీని తాకినంత మాత్రాన, పైజామా తాడు తెంపినంత మాత్రాన అత్యాచార యత్నం కిందకు రాదంటూ పేర్కొన్నారు. 
 
తద్వారా నిందితులు చేసిన నేరాలు పోక్సో చట్టంలోని సెక్షన్‌ 18, సెక్షన్‌ 376 కిందకు రావని చెబుతూనే, అదే చట్టంలోని సెక్షన్‌ 9/10 (తీవ్రమైన లైంగిక వేధింపులు), సెక్షన్‌ 354-బి (మహిళల గౌరవాన్ని దెబ్బతీసే ఉద్దేశంతో దాడి) కింద కేసులు నమోదు చేసి విచారించాలని ఆదేశించారాయన.