యుపిలో బైక్‌పై వెళ్తున్న జర్నలిస్ట్‌ కాల్చివేత

యుపిలో బైక్‌పై వెళ్తున్న జర్నలిస్ట్‌ కాల్చివేత
 
* కాశ్మీర్ జర్నలిస్ట్ హైదరి విడుదల పట్ల హర్షం
 
బైక్‌పై వెళ్తున్న జర్నలిస్ట్‌ను దుండగులు వాహనంతో ఢీకొట్టారు. ఆ తర్వాత అతడిపై కాల్పులు జరిపి హత్య చేశారు. కలకలం రేపిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లో ఈ సంఘటన జరిగింది. రాఘవేంద్ర బాజ్‌పాయ్ ఒక హిందీ దినపత్రికకు స్థానిక విలేకరిగా పని చేస్తున్నాడు. 
 
ఆర్టీఏ కార్యకర్త కూడా అయిన ఆయనకు శనివారం మధ్యాహ్నం 3.15 గంటల సమయంలో ఫోన్‌ వచ్చింది. దీంతో ఇంటి నుంచి బైక్‌పై  బయలుదేరాడు.  కాగా, లక్నో-ఢిల్లీ జాతీయ రహదారిపై బైక్‌పై వెళ్తున్న జర్నలిస్ట్‌ రాఘవేంద్రను ఒక వాహనం ఢీకొట్టింది. ఆ తర్వాత అతడిపై మూడు రౌండ్లు కాల్పులు జరిగాయి. 
 
రక్తం మడుగుల్లో పడి ఉన్న రాఘవేంద్ర రోడ్డు ప్రమాదానికి గురై మరణించినట్లుగా తొలుత పోలీసులు భావించారు. మరోవైపు మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అతడి శరీరంపై మూడు బుల్లెట్‌ గాయాలున్నట్లు డాక్టర్లు గుర్తించారు. దీంతో జర్నలిస్ట్‌ రాఘవేంద్రను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.  నిందితులను అరెస్ట్‌ చేసేందుకు నాలుగు బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీస్‌ ఉన్నతాధికారి తెలిపారు. జర్నలిస్ట్‌ హత్యా సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
 
మరోవంక,  ప్రభుత్వంపై విమర్శలు నిర్బంధానికి కారణం కాదని భారత కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు కాశ్మీరీ జర్నలిస్ట్ మాజిద్ హైదరీ ఇటీవల విడుదల కావడం పట్ల జెనీవాకు చెందిన గ్లోబల్ మీడియా భద్రత, హక్కుల సంస్థ ప్రెస్ ఎంబ్లెమ్ క్యాంపెయిన్ (పిఇసీ) హర్షం వ్యక్తం చేసింది. ప్రజా భద్రతా చట్టం కింద అరెస్టు చేసిన హైదరీని 525 రోజులకు పైగా నిర్బంధం తర్వాత జమ్మూ కాశ్మీర్ హైకోర్టు విడుదల చేసింది.
స్థానిక వార్తాపత్రిక గ్రేటర్ కాశ్మీర్‌తో పాక్షికంగా సంబంధం ఉన్న స్వతంత్ర జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకుడు ఇప్పటికే శ్రీనగర్‌లోని తన స్వస్థలానికి చేరుకున్నారు. నిధుల కైవసం, పరువు నష్టం ఆరోపణలపై సెప్టెంబర్ 2023లో ఆయనను అరెస్టు చేశారు.