ఎయిమ్స్‌లో చేరిన ఉపరాష్ట్రపతి.. ప్రధాని పరామర్శ

ఎయిమ్స్‌లో చేరిన ఉపరాష్ట్రపతి.. ప్రధాని పరామర్శ

ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఎయిమ్స్‌లో చేరారు.  శనివారం అర్థరాత్రి 2.00 గంటలకు ఉప రాష్ట్రపతి జగదీప్ దన్‌ఖడ్ తీవ్ర ఛాతీ నొప్పితో ఇబ్బంది పడ్డారు. ఈ నేపథ్యంలో ఆయన్ని వ్యక్తిగత సిబ్బంది ఎయిమ్స్ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. అనంతరం క్రిటికల్ కేర్ యూనిట్‌లో ఆయనకు అత్యవసర వైద్యం అందించారు. 

ఆసుపత్రి కార్డియాలజీ విభాగం అధిపతి డాక్టర్ రాజీవ్ నారంగ్ సారథ్యంలోని వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. 73 ఏళ్ల ఉప రాష్ట్రపతి జగదీప్ దన్‌ఖడ్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.  వైద్య బృందం నిరంతరం ఆయన పరిస్థితిని పర్యవేక్షిస్తోందని తెలిపారు.  మరోవైపు ఉప రాష్ట్రపతి దన్‌ఖడ్ అనారోగ్యం వార్త విన్న వెంటనే.. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎయిమ్స్‌కు చేరుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ డిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రికి వెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ స్వయంగా ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. జగదీప్ ధన్‌ఖడ్‌ ఆరోగ్యంగా ఉండాలని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.