ఇండియా ఏఐ కంప్యూట్ పోర్టల్ ప్రారంభించిన అశ్విని వైష్ణవ్

ఇండియా ఏఐ కంప్యూట్ పోర్టల్ ప్రారంభించిన అశ్విని వైష్ణవ్

ఇండియాఏఐ మిషన్ ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం ఇండియాఏఐ కంప్యూట్ పోర్టల్తో పాటు డేటాసెట్ ప్లాట్‌ఫామ్ ఏఐకోషాను ప్రారంభించారు. వీటితోపాటు ఇండియాఏఐ మిషన్లో భాగంగా ఏఐ యాక్సెస్‌ను మెరుగుపర్చడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకున్న అనేక ఇతర ప్రాజెక్టులను కూడా ప్రారంభించారు.

ఈ కంప్యూట్ పోర్టల్ విద్యార్థులు, స్టార్టప్‌లు, పరిశోధకులు, విద్యాసంస్థలు, ప్రభుత్వ విభాగాలకు 18,000 కంటే ఎక్కువ జీపీయులు, క్లౌడ్ స్టోరేజ్, ఇతర ఏఐ సర్వీసులను కంప్యూట్ చేసేందుకు యాక్సెస్‌ను అందిస్తుంది. ఏఐ ఇన్నోవేషన్ కోసం హై క్వాలిటీ నాన్ పెర్సనల్ డేటాసెట్‌లకు స్ట్రీమ్లైన్ యాక్సెస్ను అందించడమే ఈ ప్లాట్ఫారమ్ లక్ష్యం. 

భారత్ సొంత ఫౌండేషన్ మోడల్‌ను అభివృద్ధి చేసేందుకు ఈ కంప్యూట్ పోర్టల్ ఉపయోగపడనుంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ భారతదేశం సొంత ఫౌండేషన్ మోడల్ ప్రోగ్రెసింగ్ బాగా అభివృద్ధి చెందుతుందని, ఇందుకోసం దాదాపు 67 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. 

ఇందుకోసం ఇతర దేశాలు చేస్తున్నదానితో పోలిస్తే తక్కువ ఖర్చుతోనే దీన్ని నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. రాబోయే 3-4 సంవత్సరాలలో భారతదేశం ప్రపంచ వేదికపై పోటీ పడేంతగా సొంత జిపియులను కలిగి ఉండాలని, వీటిని ఉపయోగించేందుకు చారిత్రాత్మకంగా గంటకు రూ.100 కంటే తక్కువే ఖర్చు అవుతుందని వైష్ణవ్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యదర్శి ఎస్ కృష్ణన్ మాట్లాడుతూ కంప్యూట్ పోర్టల్ ప్రారంభం దేశవ్యాప్తంగా ఏఐని అమలు చేసే విధానాన్ని మెరుగుపరుస్తుందని అన్నారు. 2047 వికసిత్ భారత్ కలను సాధించడంలో టెక్నాలజీ, ముఖ్యంగా ఏఐ  ఒక దోహదపడే అంశం అని ఆయన పేర్కొన్నారు.

గతేడాది మార్చి నెలలో మంత్రివర్గం రూ. 10,371.92 కోట్ల బడ్జెట్‌తో ఇండియాఏఐ  మిషన్‌ను ఆమోదించింది. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యాల ద్వారా ఏఐ ఆవిష్కరణలను కేటలైజింగ్ చేసే సమగ్ర పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఇది భావిస్తోంది. ఈ మిషన్‌ను డిజిటల్ ఇండియా కార్పొరేషన్ ఆధ్వర్యంలోని ‘ఇండియాఏఐ’ ఇండిపెండెంట్ బిజినెస్ డివిజన్ అమలు చేస్తుంది.