కాంగ్రెస్‌ పార్టీపై నటి ప్రీతి జింటా ఆగ్రహం

కాంగ్రెస్‌ పార్టీపై నటి ప్రీతి జింటా ఆగ్రహం
కాంగ్రెస్ పార్టీపై బాలీవుడ్ హీరోయిన్, ఐపీఎల్‌లో పంజాబ్‌ జట్టు సహ యజమాని ప్రీతి జింటా తీవ్రంగా మండిపడ్డారు. తన సోషల్ మీడియా అకౌంట్లను బీజేపీకి అప్పగించినందుకు ఓ బ్యాంకులో ఆమె తీసుకున్న కోట్ల రుణంం మాఫీ అయ్యిందని ఆరోపిస్తూ కేరళ కాంగ్రెస్ యూనిట్ ఎక్స్ (ట్విట్టర్)లో ఓ పోస్ట్ పెట్టింది.  న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంకులో ప్రీతి జింటా రూ.18 కోట్ల రుణం తీసుకున్నారని, ఆమె తన సోషల్ మీడియా ఖాతాలను బీజేపీకి అప్పగించడంతో ఆ మొత్తం మాఫీ అయ్యిందని, గత వారం ఆ బ్యాంకును మూసేయడంతో డిపాజిటర్లు రోడ్డున పడ్డారని కేరళ కాంగ్రెస్ విభాగం ఆరోపించింది.
 
ఈ పోస్ట్‌పై నటి ప్రీతి జింటా స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీకి దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చారు. సోషల్ మీడియా అకౌంట్లను తాను సొంతంగానే నిర్వహించుకుంటానని, ఎవరికీ వాటిని అప్పగించలేదని ఆమె స్పష్టం చేశారు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. అంతేకాదు, 10 ఏళ్ల కిందటే ఆ బ్యాంకు నుంచి తాను తీసుకొన్న రుణాన్ని తిరిగి చెల్లించేశానని ఆమె వివరించారు.

‘‘ఎక్స్‌లో కాంగ్రెస్‌ పార్టీ చేసిన పోస్ట్‌ చూసి విస్తుపోయాను. నాకు ఎవరూ, ఏ రుణాన్నీ మాఫీ చేయలేదు. ఓ రాజకీయ పార్టీ నా పేరును వాడుకుని తప్పుడు సమాచారం ఎలా ప్రచారం చేస్తుంది? పదేళ్ల కిందట ఓ బ్యాంకు నుంచి రుణం తీసుకుని, దానిని తిరిగి తీర్చేశాను. వాస్తవం. తెలుసుకోకుండా అసత్య ప్రచారాలు చేయడం సిగ్గుచేటు. భవిష్యత్తులో ఎటువంటి అపోహలు, అపార్థాలు రాకూడదనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పెట్టిన పోస్ట్‌పై నేను స్పందిస్తున్నాను’’ అని ప్రీతిజింటా పేర్కొన్నారు.

అటు, తాము చేసిన ఆరోపణలు ప్రీతి జింటా స్పష్టత ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీ తాము తప్పుడు పోస్ట్ చేసినట్టు అంగీకరించింది. ‘ఇతర సెలబ్రిటీల మాదిరిగా కరుడగట్టిన ఐటీ విభాగాలకు అప్పగించకుండా మీ ఖాతాలను మీరే నిర్వహిస్తున్నట్టు తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మీడియా వార్తల ఆధారంగా మేము పోస్ట్ చేశాం. మేము ఏదైనా తప్పు చేసుంటే దానిని ఒప్పుకుంటున్నాం’ అని ట్వీట్ చేసింది.
 
కాగా, మహారాష్ట్రలోని న్యూఇండియా కోఆపరేటివ్ బ్యాంక్‌ జనరల్ మేనేజర్, అకౌంట్స్ హెడ్ హితేష్ మెహతా రూ.122 కోట్ల బ్యాంకు సొమ్మును దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆర్థిక నేరం ఆరోపణల కేసులో అరెస్టైన హితేశ్ ప్రస్తుతం ముంబయి పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ ఎలెవెన్ యజమాని ప్రీతి జింటాపై కాంగ్రెస్‌ పార్టీ రుణమాఫీ ఆరోపణలు చేయడం గమనార్హం.