ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళా చివరి దశకు చేరింది. బుధవారంతో ఈ మహాకుంభమేళా ముగియనుంది. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు ప్రయాగ్రాజ్కు తరలివెళ్తున్నారు. మంగళవారం కూడా సంగమం వైపు వెళ్లే రహదారులు జనసమూహంతో కనిపిస్తున్నాయి.
ఇప్పటివరకు అంటే ఫిబ్రవరి 25న మధ్యాహ్నం 12 గంటల నాటికి 63.36 కోట్ల మందికిపైగా భక్తులు సంగమంలో స్నానాలు చేశారని ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. రేపటి నాటికి దాదాపు 65 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేయగా, ప్రస్తుతం ఈరోజు చివరి నాటికే 65 కోట్ల మంది వచ్చేలా ఉన్నారు. చివరిరోజు రేపటి తర్వాత ఈ భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ఈ క్రమంలో మహాశివరాత్రి కోసం ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు చేయగా, రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహా కుంభమేళాకు హాజరై ఈ వేడుకను ముగించనున్నారు. రేపు ప్రయాగ్రాజ్లో మహాశివరాత్రి చివరి అమృతస్నానం కోసం భక్తులు శ్రీరాముని తపస్సు స్థలమైన చిత్రకూట్ నగరానికి పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. దీంతో చిత్రకూట్ జిల్లా యంత్రాంగం కూడా అన్ని సన్నాహాలు చేసింది.
ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు చిత్రకూట్ గుండా ప్రవహించే పవిత్ర మందాకినీ గంగానదిలో స్నానం చేసి, ఆపై ఆలయంలో స్వామిని సందర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కాగా, ప్రయాగ్రాజ్ లో ప్రభుత్వం ట్రాఫిక్ ఆంక్షలు విధించింది. మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి కుంభమేళా ప్రాంతాన్ని ‘నో వెహికల్ జోన్’గా మారుస్తున్నామని అధికారులు ప్రకటించారు. సాయంత్రం 6 గంటలకు ప్రయాగ్రాజ్ మొత్తం ఆంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించారు.
అత్యవసర, నిత్యావసర సర్వీసులకు చెందిన వాహనాలను మాత్రమే అనుమతించనున్నట్లు ప్రకటించారు. యాత్రికులంతా ఈ మార్గదర్శకాలను పాటించాలని, అధికారులకు సహకరించాలని ప్రభుత్వం కోరింది. చివరి రోజు అమృత స్నానాల కోసం కోటి మందికిపైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో కుంభమేళా ప్రాంతంలో రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా లక్నో, ప్రతాప్గఢ్ వైపు నుంచి వచ్చే యాత్రికుల కోసం ఫాఫామౌ ఘాట్ను నియమించారు. రేవాన్, బండా, చిత్రకూట్, మీర్జాపూర్ వైపు నుంచి వచ్చే వారికోసం ఆరైల్ ఘాట్ను రిజర్వ్ చేశారు. కౌశాంబి నుంచి వచ్చే భక్తుల కోసం సంగం ఘాట్ను కేటాయించారు.మరోవైపు ప్రయాగ్రాజ్కు వెళ్లే అన్ని ప్రధాన రహదారుల్లో పోలీసులు భారీగా మోహరించారు. వాహనాలు సాఫీగా ముందుకు సాగేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే 40 పోలీసు బృందాలు మోటార్బైక్లపై ఆయా మార్గాల్లో మోహరించారు. ప్రయాగ్రాజ్ను కలిపే ఏడు ప్రధాన రహదారుల్లో అదనపు డైరెక్టర్ జనరల్, ఇన్స్పెక్టర్ జనరల్ స్థాయి అధికారులు విధుల్లో ఉండనున్నారు.
కాగా, పౌష్ పూర్ణిమ సందర్భంగా జనవరి 13న ప్రారంభమైన ఈ మహాకుంభమేళా ఫిబ్రవరి 26న శివరాత్రితో ముగియనుంది. దాదాపు 45 రోజుల పాటు సాగే ఈ కుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు కోట్లాదిగా తరలివస్తున్నారు. అక్కడ గంగ, యమున, సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.
కుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ దాదాపు 64 కోట్ల మందికిపైగా భక్తులు త్రివేణీ సంగమంలో స్నానాలు ఆచరించినట్లు యూపీ సర్కార్ ప్రకటించింది. ఇక చివరి రోజు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది.
More Stories
దేశ హితం, ఉద్యోగుల హితం, శ్రామికుల హితం కోసమేబీఎంస్
హైదరాబాద్ లో వాజ్పేయికు ఘన నివాళులు
నిర్మాణపర లోపాలు సరిచేసే విబి-జి రామ్ జి చట్టం 2025