మాతృభూమికి తిరిగి వస్తా.. ప్రతీకారం తీర్చుకుంటా!

మాతృభూమికి తిరిగి వస్తా.. ప్రతీకారం తీర్చుకుంటా!

‘నా మాతృభూమికి తిరిగి వస్తాను.  కార్యకర్తల మరణానికి ప్రతీకారం తీర్చుకుంటాను’ అని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రతిజ్ఞ చేశారు. దేవుడు తనను ప్రాణాలతో ఉంచింది అందుకేనని ఆమె తెలిపారు. బంగ్లాదేశ్ ప్రజలను ప్రస్తుతం ఉగ్రవాద ప్రభుత్వం పాలిస్తోందని, మహ్మద్ యూనస్ ఒక ఉగ్రవాది అని హసీనా సంచలన వ్యాఖ్యలు చేశారు. 

బంగ్లాదేశ్‌లో అవామీ లీగ్ పార్టీ కార్యకర్తల ఏర్పాటు చేసిన ఒక బహిరంగ కార్యక్రమంలో హసీనా జూమ్ కాల్ ద్వారా హాజరయ్యారు. హసీనా ఈ సందర్భంగా తన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, తాను త్వరలోనే తిరిగి వస్తానని చెప్పారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు అంతవరకు ఓపిక పట్టాలని ఆమె కోరారు.

నిరుడు జూలై, ఆగస్టు నెలల్లో విద్యార్థులు చేసిన ఆందోళనల్లో పలువురు పోలీసులు, అవామీ లీగ్ కార్యకర్తలు, విద్యావంతులు, కళాకారులు హత్యకు గురయ్యారని హసీనా గుర్తు చేశారు. అయినప్పటికీ ఆ హత్యలకు కారకులపై యూనస్ చర్య తీసుకోలేదని ఆమె ఆరోపించారు. విచారణ కమిటీలను రద్దు చేసి యూనస్ ప్రభుత్వం దేశాన్ని నాశనం చేస్తోందని ఆమె మండిపడ్డారు.

“అవామీ లీగ్‌ పార్టీ నాయకులు సహనం, ఓర్పుతో ఐక్యంగా ఉండాలి… నేను నా దేశానికి తిరిగి వస్తా. పార్టీ కార్యకర్తల మరణాలకు ప్రతీకారం తీర్చుకుంటా.. గతంలో మాదిరిగానే అందరికీ న్యాయం చేస్తాను. గతేడాది జులై- ఆగస్టుల్లో జరిగిన నిరసనల్లో ప్రాణాలు కోల్పోయినవారు పోలీసుల కాల్పుల వల్ల చనిపోలేదు. ఇప్పుడు పోస్టుమార్టం నిర్వహిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి” అని ఆమె స్పష్టం చేశారు.

 ప్రభుత్వ కార్యాలయాలపైన, అధికారులపైన దాడులు చేయడం యూనస్ అసమర్థతకు నిదర్శనమని హసీనా విమర్శించారు. మధ్యంతర ప్రభుత్వం ఏర్పడి నెలలు గడుస్తున్నా అల్లర్లు ఆగలేదని ఆమె విమర్శించారు. దేశంలో శాంతి భద్రతలు నానాటికీ క్షీణిస్తున్నాయని, ఆర్థిక వ్యవస్థ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని ఆమె ఆరోపించారు.

“పక్కా ప్లాన్‌తో నా తండ్రి, బంగ్లా జాతిపిత ముజబూర్ రెహ్మాన్ ఇంటిని నాశనం చేశారు. మధ్యంతర ప్రభుత్వం ఏర్పడి ఇన్ని నెలలు గడుస్తున్నా.. దేశంలో హింసకు అడ్డుకట్టపడలేదు. ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలోకి వెళ్లిపోయింది. శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయి. ప్రజల భద్రత ప్రమాదంలో ఉంది. ఈ ఉగ్రవాద ప్రభుత్వాన్ని తరిమికొట్టాలి” అని హసీనా పిలుపునిచ్చారు. ఆందోళనల్లో మరణించిన పలువురు పోలీసుల కుటుంబాలతో హసీనా ఈ సందర్భంగా మాట్లాడారు.

“అల్లాహ్ నాకు రెండో జీవితాన్ని ఇచ్చారు. ఇందుకు బలమైన కారణం ఉంటుందని నేను నమ్ముతున్నాను. గతంలోను నన్ను చంపడానికి ప్రయత్నించారు. ఆగస్టు 5న కూడా హత్యాయత్నం జరిగింది. కానీ, త్రుటిలో తప్పించుకుని బయటపడ్డాను. ఇక దేశానికి తిరిగి రావడమే ఉంది. నేను న్యాయం చేస్తా. అల్లాహ్ మనకు అండగా ఉంటారు” అని హసీనా భరోసా ఇచ్చారు. మరోవైపు, హసీనాతోపాటు ఆమె క్యాబినెట్‌లోని నేతలు, సలహాదారులు, సైనికాధికారులపై నేరారోపణలు నమోదయ్యాయి. ఈక్రమంలో ఢాకా కేంద్రంగా ఉన్న ఇంటర్నేషనల్‌ క్రైమ్స్‌ ట్రైబ్యునల్‌ (ఐసిటి) ఆమెకు అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. ఇదే సమయంలో డెవిల్ హంట్ పేరుతో వేర్పాటువాదులు, చట్ట ఉల్లంఘనకు పాల్పడేవారి ఏరివేత ఆపరేషన్ ప్రారంభించినట్టు యూనస్ ప్రభుత్వం ప్రకటించింది. 

కానీ, దీని వెనుక భారీ కుట్ర ఉన్నట్టు తెలుస్తోంది. హసీనా హయాంలో పనిచేసిన 41 మంది పోలీసు అధికారులను అరెస్ట్ చేసింది. విద్యార్థుల ఆందోళన సమయంలో వారిని అణచివేశారంటూ 1059 మంది పోలీసు అధికారులను, సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగించింది.