తెలంగాణాలో మారింది సీఎం, పార్టీ జెండా మాత్రమే

తెలంగాణాలో మారింది సీఎం, పార్టీ జెండా మాత్రమే
‘‘రాష్ట్రంలో మార్పు రాలేదు… మారింది సీఎం, పార్టీ జెండా మాత్రమే.. పరిపాలన మాత్రం అలానే ఉంది’’ అని కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి విమర్శించారు. ఎమ్యెల్సీ ఎన్నికల ప్రచారం సందర్భంగా సంగారెడ్డిలో బిజెపి టీచర్స్ నియోజకవర్గ అభ్యర్థి కొమరయ్యకు మద్దతుగా జరిగిన సభలో మాట్లాడుతూ పదేళ్ళలో బీఆర్‌ఎస్ పై వ్యతిరేకత వస్తే కాంగ్రెస్ పార్టీపై పది నెలల్లోనే వ్యతిరేకత పెరిగిందని ధ్వజమెత్తారు. 

మార్పు రావాలని కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇచ్చిన 420 హామీలు అమలు చేయకుండా పూర్తిగా వైఫల్యం అయిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని మండిపడ్డారు.  బీజేపీ మాత్రమే మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేస్తుందని గుర్తు చేశారు.  బీజేపీ అభ్యర్థులు గేలిస్తే ప్రశ్నించే గొంతుకగా శాసనమండలిలో ఉంటారని కిషన్ రెడ్డి భరోసా ఇచ్చారు. 
 
బీఆర్‌ఎస్ పార్టీ శాసనమండలిని నిర్వీర్యం చేసిందని చెబుతూ అసలు శాసనమండలి ఉందా లేదా అన్న అనుమానం కలిగేటట్టు బీఆర్‌ఎస్ వ్యవహరించిందని విమర్శించారు. హైదరాబాద్‌లో నిరుద్యోగుల వద్దకు వచ్చి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. కేంద్రం పీఆర్సీ ప్రకటించినా రాష్టంలో మాత్రం ఇప్పటి వరకు ప్రకటించలేదని ప్రశ్నించారు. 
 
రాబోయే రోజైల్లో కొత్త ఇంటర్నేషనల్ స్కూల్ మాట దేవుడేరుగు ఉన్న స్కూళ్లకు రంగులు వేయలేని పరిస్థితి తెలంగాణలో ఉందని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కాంగ్రెస్, బీఆర్‌ఎస్ దెబ్బతీశాయని దుయ్యబట్టారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, వరంగల్ మెగా టెక్స్ టైల్ పార్క్, కరీంనగర్ యూరియా ఫ్యాక్టరీ, ఎన్‌టీపీసీలో విద్యుత్ ఉత్పత్తి అంతా బీజేపీ హయాంలోనే జరిగిందని తెలిపారు. 
 
రైతులకు సబ్సిడీతో ఎరువులు అందిస్తున్నది మోడీ ప్రభుత్వమని స్పష్టం చేశారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించింది కూడా తమ ప్రభుత్వమే అని చెప్పారు. 2014లో మోడీ ప్రధాని కాక ముందు రూ. 3 వేల కోట్లతో ధాన్యం కొనుగోలు చేస్తే ఇప్పుడు రూ. 26 వేల కోట్లతో తెలంగాణ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నామని తెలిపారు.
 
‘‘కేంద్రం ఏం చేసింది అంటూ మాట్లాడుతున్నారు. కేసీఆర్, రేవంత్ కలిసి వస్తే రండి. పదేళ్ళలో మోదీ ప్రభుత్వం ఏం చేసిందో చూపిస్తాం. గ్రామ పంచాయితీలకు రాష్టం నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. హరీష్ రావు, కేటీఆర్ కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధమా?’’ అంటూ కేంద్ర మంత్రి సవాల్ విసిరారు. 
రాబోవు అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుండు సున్నా మాత్రమే వస్తుందని స్పష్టం చేశారు.