
శనివారం నుంచి లక్షలకొద్ది వాహనాలు ప్రయాగరాజ్ వైపు మళ్లడంతో త్రివేణి సంగమం వద్ద స్నానాలకు సమయానికి వెళ్లలేకపోతున్నందుకు యాత్రికులంతా అసహనాన్ని వ్యక్తం చేశారు. జనాల తాకిడి ఎక్కువ కావడంతో ప్రయాగరాజ్ సంగమం రైల్వే స్టేషన్ను అధికారులు శుక్రవారం వరకు మూసివేశారు. ప్రయాగ్రాజ్కు వెళ్లే మార్గాల్లో గంటల కొద్ది ట్రాఫిక్ జామ్, రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల చాలామంది యాత్రికులు తిరిగి తమ ఇండ్లకు వెళ్లిపోవాలని కోరారు. అప్పటికే వాహనాలన్నీ ఒకేచోట కిక్కిరిసి ఉండటంతో ముందుకు వెళ్లలేక, వెనక్కు తిరగలేక ఆ వాహనాల్లోనే 11 గంటలపాటు ఆపసోపాలుపడ్డారు.
ఈ నేపథ్యంలో ప్రయాగ్రాజ్ నుంచి దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న మధ్యప్రదేశ్ నగరమైన కట్నిలో ప్రయాగ్రాజ్ను సందర్శించవద్దని పోలీసు అధికారులు ప్రజలకు సూచించారు. అయితే ప్రయాగ్రాజ్ కుంభమేళా సందర్శన కోసం వెళ్ళే వారు ఈ ట్రాఫిక్ పరిస్థితులను ముందుగా తెలుసుకుని వెళ్లాలని సూచిస్తున్నారు. ట్రాఫిక్ రద్దీ, రహదారి మూసివేత మార్గాల గురించి రియల్ టైమ్ అప్డేట్లు తెలుసుకోవడం ద్వారా సులభంగా గమ్యానికి చేరుకోవచ్చు.
రియల్ టైమ్ అప్డేట్
ప్రస్తుతం గూగుల్ మ్యాప్స్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ పరికరాల్లో అందుబాటులో ఉంది. ఇది రియల్-టైమ్ ట్రాఫిక్ అప్డేట్లను అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీని ద్వారా మీరు రోడ్లలో రద్దీని గమనించి, వేగవంతమైన మార్గాన్ని ఎంచుకోవచ్చు. ఈ యాప్ ట్రాఫిక్ పరిస్థితిని రంగు కోడెడ్ సిస్టమ్ ద్వారా మనకు అందిస్తుంది.
- ఆయా ప్రాంతాల్లో ఎరుపు ఉంటే భారీ ట్రాఫిక్ ఉందని అర్థం. ఈ ప్రాంతాల్లో మీ ప్రయాణం చాలా ఇబ్బందిగా ఉంటుంది. మీరు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవాలి. లేదంటే ఇబ్బంది పడతారు.
- మీకు పసుపు రంగు కనిపిస్తే, ఆయా చోట్ల రద్దీ కాస్తా తక్కువగా ఉందని చెప్పవచ్చు.
- ఆయా ప్రాంతాల్లో మీకు గ్రీన్ రంగు కనిపిస్తే మీరు సాఫీగా రోడ్లపై ప్రయాణించవచ్చు. ఈ మార్గం మీకు సులభ ప్రయాణాన్ని అందిస్తుంది.
ఇలా చెక్ చేసుకోండి
గూగుల్ మ్యాప్స్తో మీ ట్రాఫిక్ను ఇలా నావిగేట్ చేసుకోండి. ఈ క్రమంలో మీరు గూగుల్ మ్యాప్స్ ద్వారా ఖచ్చితమైన ట్రాఫిక్ స్థితిని తెలుసుకుని, ఈజీగా మీ గమ్యస్థానాన్ని చేరుకోవచ్చు.
- ముందుగా గూగుల్ మ్యాప్స్ యాప్ ఓపెన్ చేయండి
- తర్వాత మీ ప్రస్తుత స్థానం, గమ్యస్థానం నమోదు చేయండి
- ఆ క్రమంలో గూగుల్ మ్యాప్స్ రియల్ టైమ్ ట్రాఫిక్ అప్డేట్లను, ప్రత్యామ్నాయ మార్గాలను చూపిస్తుంది
- అప్పుడు మీ మార్గం మ్యాప్లో రంగు కోడెడ్ ట్రాఫిక్ సూచికలను చూడవచ్చు
- మీ మార్గం రెడ్ కలర్లో ఉంటే, ప్రయాణం కోసం ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోవాలి
144 ఏళ్లకోసారి వచ్చే ఈ మహా కుంభమేళా జనవరి 13న ప్రారంభమయ్యింది. భారత్తోపాటు విదేశాల నుంచి భారీసంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. ఫిబ్రవరి 26 వరకు ఈ వేడుక జరగనుంది. ఇప్పటివరకు పలువురు రాజకీయ, సినీ, వ్యాపారరంగాలతో పాటు పలువురు ప్రముఖులు, సామాన్య పౌరులు కలిపి 44 కోట్ల మంది పుణ్యస్నానం ఆచరించారని యూపీ ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి.
More Stories
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్
పాక్ కు చైనా, ఐరోపా, యుఎఈ, అమెరికాల నిఘా యంత్రాలు