
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీది ముగిసిపోయిన చరిత్రని మెదక్ బిజెపి ఎంపీ రఘునందన్ రావు స్పష్టం చేశారు. ఇక రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ మాత్రమే మిగిలాయని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పని కూడా త్వరలో అయిపోతుందని, 14 నెలల రేవంత్ రెడ్డి పాలనలో హామీలేమీ అమలు కాలేదని మండిపడ్డారు.
సిద్దిపేట బీజేపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ శ్రేణుల్లో జోష్ నింపేలా ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ “తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలువాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరో ఆ పార్టీ ఇంతవరకు ప్రకటించలేదు. అన్ని తామేనని చెప్పుకునే ఆరడుగుల పొడుగున్న హరీశ్ రావు.. పక్కనే పదేండ్లు పాలించిన వ్యక్తి ఉన్నా మీ అభ్యర్థి ఎవరంటే చెప్పడం లేదు” అంటూ ఎద్దేవా చేశారు.
“మేము లెగిస్తే ఆగమంటారు.. కానీ లేవడం లేదు. బీఆర్ఎస్ వాళ్లవి ఉత్తరకుమార ప్రగల్భాలు. మెదక్ ఎంపీ ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితమై తలకాయలు ఎక్కడ పెట్టుకోవాలో తెలియని స్థితి వారిది. వాళ్లు మళ్లీ పోటీకి దిగితే వారెంటో.. మనమేంటో తెలుస్తుంది” అంటూ ధ్వజమెత్తారు. తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక మూడు రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ ఉందని చెబుతూ కాంగ్రెస్ ముక్త భారత్కు కేవలం మూడడుగుల దూరంలో ఉన్నామని తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరో దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారన్నీ హెచ్చరించారు.
రిటైర్ అయ్యే ప్రభుత్వ ఉద్యోగులకు రూ.8 వేల కోట్లు ఇవ్వాల్సి ఉందని, అందుకనే అందుకే రిటైర్మెంట్ వయసును మరో నాలుగేళ్లు పెంచే దురాలోచన కాంగ్రెస్ సర్కార్ చేస్తోందని ఆరోపించారు. రేవంత్ సీఎం సీటు నుంచి లెగిస్తే కుర్చీ ఎవరు ఎత్తుకెళ్తారనే పరిస్థితి ఆయనిదని ఎద్దేవా చేశారు. పదకొండేళ్ల మోదీ పాలనలో రూ.2 లక్షలు ఉన్న ఆదాయపన్ను రిలీఫ్ను నేడు రూ.12.75 లక్షలకు పెంచుకున్నామని, ఇదీ పేద, మధ్య తరగతి ప్రజల పట్ల బీజేపీకి ఉన్న చిత్తశుద్ధి అని చెప్పారు.
More Stories
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
కాళేశ్వరం రూ. లక్ష కోట్ల అవినీతిపై సిబిఐ విచారించాలి