హిమాచల్, కర్ణాటక, తెలంగాణలో బిజెపి ప్రభుత్వాలు ఖాయం

హిమాచల్, కర్ణాటక, తెలంగాణలో బిజెపి ప్రభుత్వాలు ఖాయం

భవిష్యత్తులో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వాలున్న హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చిన బిజెపిదే విజయమని కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో బిజెపి మూడు రాష్ట్రాల్లో కాషాయ జెండా రెపరెపలాడడం ఖాయమని చెప్పారు. రాహుల్ గాంధీ ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎక్కడా గెలవదని విమర్శించారు.

రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ఆ పార్టీ కార్యకర్తలే విశ్వసించడం లేదని విమర్శించారు. రాహుల్ గాంధీ, కేజ్రీవాల్ ఒకే రకంగా ఆలోచిస్తున్నారని, తాము గెలవాలని అనుకోవడం లేదని, బిజెపి గెలవకూడదని అనుకుని రాజకీయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేజ్రీవాల్, సిసోడియా వంటి నేతలను ఢిల్లీ ఓటర్లు ఓడించారని గుర్తు చేశారు. 

ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఓటమికి ఉన్న సవాలక్ష కారణాల్లో ప్రధాన కారణం మద్యం కుంభకోణమేనని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. బీరు, బ్రాందీలో కేజ్రీవాల్ మునిగి తేలడం వల్లే ఆప్‌ను ప్రజలు ఆయనను ఛీకొట్టారని వ్యాఖ్యానించారు. మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్ నిందితుడా? కాదా? అనేది ఢిల్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో స్పష్టమైందని, ఇక కోర్టే నిర్ధారించాల్సి ఉందని తెలిపారు.

అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతానని రాజకీయాల్లోకి వచ్చిన కేజ్రీవాల్ చివరికి ఆయనే అవినీతికి చిరునామాగా మారిపోయారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోతే ఏం జరుగుతుందో ఢిల్లీ ఫలితాలు ఉదాహరణగా నిలిచాయని పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజలు అభివృద్ధి, సంక్షేమం బిజెపితోనే సాధ్యమని భావించి భారీ మెజార్టీతో గెలిపించారని చెప్పారు. 

ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోవడం వల్లే ఆ పార్టీని ప్రజలు ఆదరించలేదని తెలిపారు. ఎన్నికల్లో ఎన్నో ఉచిత పథకాల పేరిట ఇచ్చిన హామీలను ప్రజలు తిరస్కరించారని పేర్కొన్నారు. బిజెపితోనే భవిష్యత్తు, మోదీతోనే గ్యారంటీ అని ప్రజలు గుర్తించి ఓట్లేసి గెలిపించారని తెలిపారు. ఇప్పుడే కాదు 2050లో కూడా ఆప్‌ను ఓడించడం మోదీ తరం కాదని నోటికొచ్చినట్లు మాట్లాడిన కేజ్రీవాల్ అహంకారం నేటి ఢిల్లీ ప్రజల తీర్పుతో అణిగిపోయిందని చెప్పారు.

కాగా, దేశంలో కాంగ్రెస్ దీనస్థితి చూస్తే అందరికీ జాలి కలుగుతోందని ఎద్దేవా చేశారు. రాహుల్‌గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్‌కు ఇది ఎన్నో ఓటమో లెక్కపెట్టలేమని చెప్పారు. ఢిల్లీలో వరుసగా మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ డకౌట్ అయ్యిందని చురకలు వేశారు. అసలు గెలవాలనే ఆలోచన కాంగ్రెస్‌కు ఎప్పుడూ ఉండదని, మోదీని, బిజెపిని ఓడించాలని మాత్రమే రాహుల్ గాంధీ ఆలోచన చేస్తారని పేర్కొన్నారు. 

రాహుల్ గాంధీ రాజ్యాంగం పుస్తకాన్ని చేతిలో పట్టుకుని తిరగటం కాదని, రాజ్యాంగ విలువలు పాటించాలని కిషన్‌రెడ్డి సూచించారు. జైలు నుంచే పరిపాలన చేసిన కేజ్రీవాల్ డ్రామాలను ప్రజలు తిప్పికొట్టారని పేర్కొన్నారు. పదేళ్లుగా అభివృద్ధికి నోచుకోని ఢిల్లీలో ఇకపై అభివృధ్ధి జరుగుతుందని కిషన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ఢిల్లీలోని బిజెపి నాయకులు, కార్యకర్తలు, ఓటర్లకు కిషన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

ఇలా ఉండగా, తెలంగాణాలో బిజెపి అధికారంలోకి వస్తే ముస్లిం బిసి అనే పదాన్ని రిజర్వేషన్ల కేటగిరి నుంచి తొలగిస్తామని కిషన్‌రెడ్డి ప్రకటించారు. బీసీలను అవమానిస్తూ గతం నుంచీ కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తోందని విమర్శించారు. తెలంగాణలో జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లో అనుసరించాల్సిన ప్రణాళికలపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అభ్యర్థులు, కీలక నేతలతో శనివారం సమీక్ష నిర్వహించారు. 

ఈ సమీక్షలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్, బిజెపి జాతీ య ఉపాధ్యక్షురాలు, మహబూబ్‌నగర్ ఎంపి డీకే అరు ణ, ఎంపి రఘునందన్‌రావు, మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు, సీనియర్ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.