48 స్థానాలతో బిజెపి విజయకేతనం

48 స్థానాలతో బిజెపి విజయకేతనం
 
హోరాహోరీగా సాగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 70 అసెంబ్లీ స్థానాల్లో అధికారానికి అవసరమైన మెజారిటీ మార్క్ 36 స్థానాలను సునాయాసంగా దాటేసి 48 స్థానాలను గెలుచుకుంది. 22 స్థానాలతో ఆమ్ ఆద్మీ పార్టీ రెండో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ పార్టీ వరుసగా మూడోసారి కూడా ఒక్కసీటు కూడా గెలుచు కోకుండా హ్యాట్రిక్ ‘జోరో’లతో చతికిలపడింది. బీజేపీ ఘనవిజయంతో 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికార పగ్గాలు పెట్టబోతోంది.

అసెంబ్లీ ఎన్నికల్లో వెలివడిన ఫలితాలు ఆప్‌ను ఘోరంగా దెబ్బతీశాయి. టాప్-3లో ఉన్న అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైన్ ఓటమి చవిచూశారు. కేజ్రీవాల్ న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో 3 వేల పైచిలుకు ఓట్లతో బీజేపీ అభ్యర్థి పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ చేతిలో ఓడిపోయారు. 

మనీష్ సిసోడియా జంగ్‌పురలో బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ చేతిలో 600 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. షాకుర్ బస్తీలో బీజేపీ అభ్యర్థి కర్నాల్ సింగ్ చేతిలో 19,000 కు పైగా ఓట్ల తేడాతో సత్యేందర్ జైన్ ఓడిపోయారు. ఢిల్లీ సీఎం అతిషి మాత్రం తన సమీప బీజేపీ అభ్యర్థి రమష్ బిధూరిపై 3,521 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.

 కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల విషయంలో ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లే ఫలితాల సరళి కనిపించింది. బీజేపీకి 40 నుంచి 55 సీట్లు రావచ్చని యాక్సిస్ మై ఇండియా సంస్థ అంచనా వేసింది. ఆప్ 15 నుంచి 25 సీట్లకే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. కాంగ్రెస్ 1 సీటుకే పరిమితం కావచ్చని తెలిపింది. 

టుడేస్ చాణక్య సైతం అచ్చం ఇదే తరహా అంచనాలను వెలువరించింది. బీజేపీకి 51, ఆప్‌కు 19 సీట్లు రావొచ్చని జోస్యం చెప్పింది. బీజేపీకి 35 నుంచి 40 సీట్లు, ఆప్‌కు 32 నుంచి 37 సీట్లు, కాంగ్రెస్ 1 సీటు రావొచ్చని మ్యాట్రిజ్ అంచనా వేసింది. దీంతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు అన్ని ఎగ్జిట్ పోల్స్ సరైన విధంగానే అంచనా వేశాయి. కౌంటింగ్​ మొదటి నుంచి ఎగ్జిట్ పోల్స్ అంచనాల తగ్గట్లే సరళి కనిపించింది.