యుఎస్ ఎయిడ్ మూసివేతతో భారత్ పై ప్రభావం నామమాత్రమే!

యుఎస్ ఎయిడ్ మూసివేతతో భారత్ పై ప్రభావం నామమాత్రమే!

అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో యుఎస్ ఎయిడ్ ద్వారా అనేక దేశాలకు ఆర్ధిక సమయం అందిస్తున్నారు.. భారత్‌కు కూడా యుఎస్ ఎయిడ్  ద్వారా అనేక ప్రాజెక్టుల కోసం నిధులు విడుదలయ్యాయి. గత ఏడాది మాత్రమే భారత్‌కు రూ. 1,228 కోట్ల సాయం అందింది. ప్రధానంగా ఆరోగ్య పరిరక్షణ, పేదరిక నిర్మూలన, పర్యావరణ పరిరక్షణ, విద్య రంగాల్లో ఈ నిధులు ఉపయోగిస్తున్నారు.

భారత్‌లో క్షయ వ్యాధి నివారణ, హెచ్ ఐ వి నియంత్రణ, మరుగుదొడ్ల నిర్మాణం వంటి ప్రాజెక్టులకు దీని ద్వారా సహాయం ఎంతో కీలకంగా మారింది. స్వచ్ఛ భారత్ వంటి ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా ఈ నిధులు ఉపయోగపడిన సందర్భాలు ఉన్నాయి. అయితే, తాజా పరిణామాల్లో అమెరికా తన విదేశీ సాయాన్ని తగ్గించనున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. 

దీనివల్ల భారత్‌పై తక్కువ లేదా అసలు ప్రభావం ఉండకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే భారత్ స్వయం సమృద్ధి దిశగా ప్రయాణిస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడంతో, విదేశీ సహాయంపై ఆధారపడే పరిస్థితి తగ్గిపోయింది. కేంద్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలను స్వతంత్రంగా అమలు చేయగల సామర్థ్యాన్ని పెంచుకుంది. 

అంతేకాకుండా, స్వదేశీ నిధులతోనే అనేక సామాజిక సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అమెరికా ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 160 దేశాలకు సుమారు రూ. 3.83 లక్షల కోట్లు నిధులను సహాయంగా అందిస్తోంది. ఇందులో భారత్‌కు ఒక మినహాయింపు ఇచ్చినప్పటికీ, దీని ప్రభావం ఆర్థికంగా పెద్దగా ఉండదని అంచనా వేస్తున్నారు. 

ఎందుకంటే, భారత్ ఇప్పటికే ప్రపంచ స్థాయిలో వేగంగా అభివృద్ధి చెందుతున్న అర్థిక వ్యవస్థలలో ఒకటిగా మారింది. యుఎస్ ఎయిడ్   నిధుల నిలిపివేత భారత ప్రభుత్వ ప్రణాళికలను పెద్దగా ప్రభావితం చేయకపోవచ్చు. ముఖ్యంగా స్వదేశీ ప్రాజెక్టులు, అంతర్జాతీయ సహకార ఒప్పందాలు, ఇతర పెట్టుబడుల ద్వారా భారత్ అభివృద్ధి తన దారిలో కొనసాగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా సహాయం తగ్గినప్పటికీ, భారత్ తన అభివృద్ధి మార్గంలో ముందుకు సాగుతుందనడంలో ఎటువంటి అనుమానం లేదు.