ట్రిపుల్‌ తలాక్‌’పై కేంద్రం స్పందన కోరిన సుప్రీంకోర్టు

ట్రిపుల్‌ తలాక్‌’పై కేంద్రం స్పందన కోరిన సుప్రీంకోర్టు
ట్రిపుల్‌ తలాక్‌ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ జరిపింది. ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ చట్టాన్ని ఉల్లంఘించి.. తమ జీవిత భాగస్వామానికి ట్రిపుల్‌ తలాక్‌ ఇచ్చిన భర్తలపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లు, చారిషీట్ల సంఖ్యపై సమాచారం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
 
చట్టం రాజ్యాంగబద్ధతను సవాల్‌ చేస్తూ దాఖలైన 12 పిటిషన్లపై సీజేఐ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.  ఆయా పిటిషన్లపై లిఖితపూర్వక వాదనలు దాఖలు చేయాలని కేంద్రంతో పాటు ఇతర పక్షాలను కోర్టు కోరింది.  ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ చట్టంలోని 2019లోని సెక్షన్లు 3, 4 కింద పెండింగ్‌లో ఉన్న మొత్తం ఎఫ్‌ఐఆర్‌, చారిషీట్ల సంఖ్యను కేంద్ర ప్రభుత్వం దాఖలు చేస్తుందని.. మిగతా పార్టీలు లిఖితపూర్వక వాదనలు సమర్పించాలని చెప్పింది. మార్చి 17న పిటిషన్లపై తుది విచారించనున్నట్లు బెంచ్‌ పేర్కొంది. 
 
2019 జూలై 30న దేశంలో ట్రిపుల్‌ తలాక్‌పై కేంద్రం చట్టం తెచ్చింది. చట్టం ప్రకారం తలాక్‌ ఇవ్వడం చట్టవిరుద్ధం. ట్రిపుల్‌ తలాక్‌ ఇస్తే భర్తకు మూడేళ్ల వరకు శిక్ష విధిస్తారు. 2019 తీసుకువచ్చిన చట్టం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ కేరళకు చెందిన జమియాతుల్‌ ఉలేమా పిటిషన్‌ దాఖలు చేసింది. ట్రిపుల్‌ తలాక్‌ చల్లదని సుప్రీంకోర్టు తీర్పును సవాల్‌ చేశారు. 
 
సుప్రీంకోర్టు 2017 ఆగస్టు 22న ట్రిపుల్‌ తలాక్‌ రాజ్యాంగ విరుద్ధమంటూ చారిత్రాత్మక తీర్పును ఇచ్చిన విషయం తెలిసిందే. వివిధ మతాలకు చెందిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం 3-2 తేడాతో తీర్పును ఇచ్చింది. ఆరు నెలల్లోగా ట్రిపుల్‌ తలాకప్‌పై చట్టం చేయాలని ప్రభుత్వానికి సూచించింది.