పసుపు బోర్డు ఏర్పాటు ఆరంభం మాత్రమే

పసుపు బోర్డు ఏర్పాటు ఆరంభం మాత్రమే
నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని తాను ఇచ్చిన హామీని నెరవేర్చుకున్న సందర్భంగా బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ పసుపు బోర్డు ఏర్పాటు ఆరంభం మాత్రమే అని తెలిపారు. దేశంలో 37 ఏళ్ల తర్వాత ఒక బోర్డు ఏర్పాటు జరిగిందని అర్వింద్ గుర్తు చేస్తూ  పండగ రోజు ప్రధాని నరేంద్ర మోదీ అరుదైన బహుమతి ఇచ్చారని అభివర్ణించారు. 
 
పసుపు బోర్డు వల్ల కేవలం పసుపు రైతులకే కాకుండా ఇతర పంటలతో పాటు అక్కడ పరిశ్రమలు, ప్రాసెసింగ్ యూనిట్లు, పర్యాటకం, ప్యాకేజీ యూనిట్లు కూడా రాబోతున్నాయని చెప్పుకొచ్చారు. నిజామాబాద్‌లో అల్లం, పసుపు, కూరగాయలు అనేక పంటలు పండుతాయని ఆ రైతలకూ లబ్ధి చేకూరే అవకాశం ఉందని చెప్పారు. 
 
అలాగే నిజామాబాద్ ప్రాంతంలో బీడీ కార్మికులు ఎక్కువగా ఉన్నారని, ప్రస్తుతం వారి జీవనోపాధి తక్కువగా ఉందని చెప్పుకొచ్చారు. పసుపు బోర్డుతో వారికీ ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని చెప్పారు.  నిజామాబాద్ ప్రజలకు లిక్కర్ వద్దు పసుపు బోర్డు ముద్దంటూ ఆయన నినాదం ఇచ్చారు.  
 తాను రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చానని, భవిష్యత్తులో మరిన్ని హామీలు నెరవేరుస్తానని చెప్పుకొచ్చారు. నిజామాబాద్‌లో 10 రైల్వే ఆర్వోబీలు నిర్మించాలని, ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చుకుంటూ తాను ముందుకెళ్తానని ఎంపీ అరవింద్ చెప్పారు.
 
పసుపు పసుపు బోర్డు కార్యాలయం నిజామాబాద్‌కు రావడంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పీయూష్ గోయల్ కృషి చాలా ఉందని అరవింద్ తెలిపారు. పసుపు పంటలపై అన్ని అంశాల్లో అవగాహన ఉన్న పల్లె గంగారెడ్డి పసుపు బోర్డు ఛైర్మన్‌గా నియామకం కావడం సంతోషకరమని తెలిపారు. తెలంగాణ బీజేపీ నేతల కృషి ఫలితంగానే 33 ఏళ్ల తర్వాత దేశంలో పసుపు బోర్డు ఏర్పాటు అయ్యిందని ఎంపీ అరవింద్ చెప్పారు.
 
కాగా, బీఆర్ఎస్ అనేది భూస్థాపితం కాబోయే సమితి అని, ఆ పార్టీ గురించి మాట్లాడటం వృధా అని విమర్శించారు.  ఈ దేశాన్ని, తెలంగాణను కాంగ్రెస్, కేసీఆర్ పూర్తిగా భ్రష్టు పట్టించారని దుయ్యబట్టారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ దృష్టి అంతా ఎంతసేపు రాజకీయాలు, అవినీతి, సంపాదనపై మాత్రమే ఉందని, అందువల్లే ఈ దేశం వెనుకబడిపోయిందని ఆయన ఆరోపించారు.  
 
తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ఏదో సాధించామని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో పడుకున్నారని ఆయన ఆగ్రహించారు.
బీఆర్ఎస్ పాలనలో అనేక రంగాలు కుంటుపడిపోయాయని అరవింద్ విమర్శించారు. పదేళ్లలో కరెంటు అదనంగా ఉత్పత్తి చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే జైలుకు వెళ్లి వచ్చారని, ఇప్పుడు కేటీఆర్ సైతం జైలుకు వెళ్తారని ఎంపీ జోస్యం చెప్పారు. 
 
పసుపు బోర్డు చుట్టూ అనేక రాజకీయాలు జరిగాయని, పసుపు బోర్డు విషయంలో తనను అనేక రకాలుగా టార్గెట్ చేశారని ధర్మపురి అర్వింద్ చెప్పుకొచ్చారు. పసుపు రైతుల ముసుగులో ఇండ్లపైకి, బండ్లపైకి గుండాలను పంపించి దాడులు చేయించారని చెప్పుకొచ్చారు. ఫ్రమ్ బాండ్ టు బోర్డు వరకు ఇదో ప్రస్థానం అని తెలిపారు. 
 
మరోవైపు, మంత్రి తుమ్మల నాగేశ్వర రావుకు వయసు పెరిగినా చిలిపి చేష్టలు మాత్రం పోలేవని అర్వింద్ విమర్శించారు. ఆయన ఏ పార్టీలో ఉన్నారో ఆయనకైనా తెలుసా? అంటూ ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం కేంద్రానికి లేఖలు రాయడం వల్లే పసుపు బోర్డు కార్యాలయం తెలంగాణలో సాకారమైందని మంత్రి తుమ్మల చేసిన వ్యాఖ్యలకు ప్రస్తావిస్తూ చేతనైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన చెరుకు ఫ్యాక్టరీలను తుమ్మల తెరిపించాలని సవాల్ చేశారు.

మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, మాజీ మంత్రి నిరంజన్‌ రెడ్డి మినీ కేసీఆర్‌లని ధర్మపురి అర్వింద్ ధ్వజమెత్తారు. వీళ్లు కేవలం సొంత ఫామ్‌హౌసుల్లోనే వ్యవసాయం చేస్తారని, బయట చేయలేరని, కనీసం రైతులను పట్టించుకోరని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.