నాలుగు నెలల కనిష్టానికి డిసెంబర్ రిటైల్ ద్రవ్యోల్బణం

నాలుగు నెలల కనిష్టానికి డిసెంబర్ రిటైల్ ద్రవ్యోల్బణం
ఆహార వస్తువుల ధరలు తగ్గడంతో డిసెంబర్‌ నెల రిటైల్‌ ద్రవ్యోల్బణం నాలుగు నెలల కనిష్టానికి దిగి వచ్చింది. నవంబర్‌లో 5.48 శాతంగా నమోదైన రిటైల్‌ ద్రవ్యోల్బణం.. డిసెంబర్‌ నెలలో 5.22 శాతానికి దిగి వచ్చింది. అక్టోబర్‌లో 6.21 శాతంతో 14-నెలల గరిష్ట స్థాయికి చేరుకున్న రిటైల్‌ ద్రవ్యోల్బణం.. నవంబర్‌లో పతనమైంది. డిసెంబర్‌ రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐ అంచనాలకు అనుగుణంగా 2-6 శాతం మధ్యకు దిగి వచ్చింది.

ఆహార ద్రవ్యోల్బణం నవంబర్‌లో 9.04 శాతం నుండి డిసెంబర్‌లో 8.4 శాతానికి స్వల్పంగా తగ్గిందని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఒ) సోమవారం ప్రకటించింది.  కూరగాయలు, పప్పు ధాన్యాలు, చెక్కెర, తృణ ధాన్యాల ధరలు తగ్గడం వల్లే డిసెంబర్ ఆహార ద్రవ్యోల్బణం గణనీయంగా దిగి వచ్చింది. కన్‌ఫెక్షనరీ, పర్సనల్‌ కేర్‌ ధరలు దిగి వచ్చాయి. గ్రామీణ ద్రవోల్బనం 5.76 శాతంగా ఉంటే, పట్టణ ద్రవ్యోల్బణం 4.58 శాతంగా రికార్డైంది.

2024 డిసెంబర్‌లో అఖిల భారత స్థాయిలో సంవత్సరానికి ద్రవ్యోల్బణాన్ని పెంచుతున్న మొదటి ఐదు వస్తువులు బఠాణీలు (89.12శాతం), బంగాళా దుంపలు (68.23 శాతం), వెల్లుల్లి (58.17శాతం), కొబ్బరి నూనె (45.41 శాతం), కాలీఫ్లవర్‌ (39.42శాతం) అని ఎన్‌ఎస్‌ఒ పేర్కొంది. 2024- 25 మూడవ త్రైమాసికంలో భారత వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణం సగటున 5.63 శాతంగా ఉంది. గత నెలలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) అంచనా వేసిన 5.7 శాతం కన్నా స్వల్పంగా తగ్గినట్లు ఎన్‌ఎస్‌ఒ తెలిపింది.

నెలవారీ ప్రాతిపదికన, డిసెంబర్‌లో వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ) 0.56 శాతం తగ్గింది. అయితే వినియోగదారుల ఆహార ధరల సూచీ(సిఎఫ్‌పిఐ) నవంబర్‌ కన్నా 1.5 శాతం తక్కువగా ఉంది. ఆహార ద్రవ్యోల్బణం కూడా నాలుగు నెలల కనిష్టానికి తగ్గింది. అక్టోబర్‌లో 15 నెలల గరిష్టస్థాయి 10.9 శాతం నుండి డిసెంబర్‌లో క్షీణతను సూచిస్తుంది. కొన్ని కీలకమైన ఆహార పదార్ధాల ధరలు వేగంగా పెరిగాయని పేర్కొంది.