
సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని మరో 52 అదనపు రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. సికింద్రాబాద్, చర్లపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్ల నుంచి కాకినాడ, తిరుపతి, నర్సాపూర్, శ్రీకాకుళం ప్రాంతాలకు ఈ రైళ్లను నడపనున్నట్లుగా దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఆయా ప్రాంతాలకు 6 నుంచి 18వ తేదీ వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని వివరించింది.
ఇదిలా ఉండగా, సంక్రాంతి పండుగ రద్దీకి తగ్గట్టుగా ఇప్పటికే పలు ప్రత్యేక రైళ్లను ద.మ రైల్వే ప్రకటించింది. ఈసారి సంక్రాంతి కోసం ఇప్పటికే 122 స్పెషల్ రైళ్లను సిద్ధం చేసినట్లుగా తెలిపింది. వాటికి అదనంగా మరో 60 రైళ్లను నడపాలని నిర్ణయించినట్లు కొద్ది రోజుల క్రితమే సీపీఆర్వో (దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ అధికారి) శ్రీధర్ వెల్లడించారు. వీటితో పాటు మరో 90 పాసింగ్ త్రూ రైళ్లను కూడా నడిపిస్తున్నట్లుగా వివరించారు.
సీపీఆర్వో శ్రీధర్ మాట్లాడుతూ గతేడాది 70 స్పెషల్ రైళ్లను నడిపినట్లుగా తెలిపారు. అయితే ఈ సంక్రాంతికి పెరిగే రద్దీని దృష్టిలో ఉంచుకుని దాదాపు 160 నుంచి 170 రైళ్లను ద.మ నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా వివరించారు. గత ఏడాదితో పోలీస్తే ఈ ఏడాది అధిక సంఖ్యలో స్పెషల్ రైళ్లను నడుపుతున్నట్లు వివరించారు.
ప్రతీ ఏటా సంక్రాంతికి అధిక సంఖ్యలో రద్దీ ఉంటుంది. ఈ ఏడాది కూడా ప్రయాణికులు రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో రైల్వే అధికారులు అందుకు తగిన చర్యలు చేపడుతున్నారు. అదనపు రైళ్ల ద్వారా రద్దీని తగ్గించే ఏర్పాట్లు చేస్తున్నారు. మరో వైపు ఉన్న రైళ్లకు బోగీలను పెంచే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు.
కొంతమంది ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు ప్రయాణికుల అవసరాన్ని ‘క్యాష్’ చేసుకుంటున్నారు. టికెట్ల రేట్లను భారీ స్థాయిలో పెంచి డబ్బులు దండుకునే అవకాశాలు ఉన్న నేపథ్యంలో రవాణా శాఖ అధికారులు దీనిపై దృష్టి సారించాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
More Stories
ముగ్గురు మావోయిస్టు కీలక నేతల లొంగుబాటు
హైకోర్టు స్టేకు కాంగ్రెస్ కారణం.. వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లాలి
స్థానిక సంస్థల ఎన్నికలు, జీవో నెంబర్ 9పై హైకోర్టు స్టే