బెంగళూరులో రెండు, గుజరాత్ లో 1 హెచ్‌ఎమ్‌పీవీ కేసులు

బెంగళూరులో రెండు, గుజరాత్ లో 1 హెచ్‌ఎమ్‌పీవీ కేసులు

 కరోనా వైరస్‌కు పుట్టినిల్లుగా చెప్పుకునే చైనాలో హ్యూమన్‌ మెటాప్న్యూమోవైరస్‌ తీవ్రంగా వ్యాప్తి చెందుతోన్న విషయం తెలిసిందే. వైరస్‌ రోగులతో అక్కడి ఆసుపత్రులు, శ్మశానవాటికలు కిక్కిరిసిపోతున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది. మొదటిసారిగా భారత దేశంలో ముగ్గురు చిన్నారులకు బెంగుళూరులోని ఆసుపత్రిలో ఈ వైరస్ ను కనుగొన్నారు.

రెండు కేసులూ కర్ణాటక రాజధాని బెంగళూరులోనే వెలుగు చూసినట్లు భారత వైద్య పరిశోధన మండలి (ఐసిఎంఆర్) తాజాగా ధృవీకరించింది. ఇక అహ్మదాబాద్​లో వైరస్​ సోకిన మరో చిన్నారికి ప్రస్తుతం చికిత్స అందుతోందని, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించింది. శ్వాస సంబంధిత వ్యాధులపై సాధారణ పర్యవేక్షణలో భాగంగా ఈ వైరస్​ కేసులు గుర్తించినట్లు తెలిపింది.
బెంగళూరులోని బాప్టిస్ట్‌ ఆసుపత్రిలో మూడు నెలల చిన్నారి, ఎనిమిది నెలల పాపకు ఈ వైరస్‌ సోకిటనట్లు తేలింది.  మూడు నెలల శిశువు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ కాగా, ఎనిమిది నెలల పాప ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు వెల్లడించింది. బాధిత కుటుంబ సభ్యులకు అంతర్జాతీయ ప్రయాణాలు చేసిన హిస్టరీ లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది.

హ్యూమన్‌ మెటాన్యూమోవైరస్‌ను(హెచ్‌ఎంపీవీ) మొదట 2001లో గుర్తించారు. 2011-12లో అమెరికా, కెనడా, ఐరోపా ఈ వైరస్‌ కేసులు నమోదయ్యాయి. నేపథ్యంలోనే తాజాగా హెచ్‌ఎమ్‌పీవీ వైరస్‌ ఇతర దేశాలకు కూడా వ్యాపిస్తోంది. తాజాగా భారత్‌లో రెండు రెండు కేసులు వెలుగుచూశాయి.

హెచ్‌ఎంపీవీ వైరస్‌ సోకితే సాధారణంగా దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి. వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్నవారిలో బ్రాంకైటిస్‌, నిమోనియా వంటి సమస్యలకు సైతం దారి తీయొచ్చు. సాధారణంగా వైరస్‌ సోకిన మూడు నుంచి ఆరు రోజుల్లో వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి.

తరచూ సబ్బుతో కనీసం 20 సెకన్ల పాటు చేతులను శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకోని చేతులతో ముఖాన్ని ముట్టుకోవద్దు. అనారోగ్య లక్షణాలతో ఉన్నవారికి కొంచెం దూరంగా మసులుకోవాలి. తరచూ ముట్టుకునే వస్తువులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు ముక్కు, నోరుకు టిష్యూ లేదా కర్చీఫ్‌ను అడ్డుపెట్టుకోవాలి. తరచూ కనీసం 20 సెకన్ల పాటు సబ్బు, నీటితో శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత వస్తువులు ఇతరులు వినియోగించడానికి ఇవ్వొద్దు. అనారోగ్యంగా ఉంటే ఇంటికే పరిమితం అవడం మంచిది.

అయితే, చైనాలో వెలుగుచూస్తోన్న హెచ్‌ఎంపీవీ వైరస్ రకం, చిన్నారిలో గుర్తించినది ఒకటేనా, కాదా? అనే వివరాలు తెలియాల్సి ఉంది. చైనాలో హ్యూమన్ మెటాన్యూమోవైరస్‌ సహా పలు శ్వాసకోశ వ్యాధులు విజృంభిస్తున్నాయన్న వార్తలతో ఇప్పటికే భారత్ అలర్ట్​ అయింది. ఇటీవలే డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ అధ్యక్షతన జాయింట్‌ మానిటరింగ్‌ గ్రూప్‌ సమావేశం కూడా నిర్వహించింది. ముందస్తు చర్యల్లో భాగంగా ఇప్పటికే వివిధ చోట్ల ఆర్‌ఎస్‌ఏ, హెచ్‌ఎంపీవీ తదితర పరీక్షలు చేస్తున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఒకవేళ శ్వాసకోశ వ్యాధులు అనుకోకుండా పెరిగినా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.