మందుపాత‌ర పేలి ఎనిమిది మంది జ‌వాన్లు మృతి

మందుపాత‌ర పేలి ఎనిమిది మంది జ‌వాన్లు మృతి

* ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో మావోయిస్టుల దుశ్చ‌ర్య‌ … 9 మంది మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్‌ జిల్లాలో జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని మావోయిస్టులు ఐఈడీ బాంబుతో పేల్చేశారు. ఈ ఘటనలో 8 మంది డిస్ట్రిక్ట్​ రిజర్వ్​ గార్డ్​-డీఆర్​జీ సిబ్బందితోపాటు ఓ డ్రైవర్​ మృతి చెందినట్లు బస్తర్​ రేంజ్​ ఐజీ సుందర్​రాజ్ తెలిపారు. మరో ఆరుగురికి గాయాలైనట్లు తెలుస్తోంది. దాడి జరిగిన సమయంలో వాహనంలో 15 మంది భద్రతా సిబ్బంది ఉన్నట్లు సమాచారం.

దాడికి గురైన బస్సులోని సిబ్బంది దంతెవాడ, నారాయణ్​పుర్​, బీజాపుర్​లో యాంటీ నక్సలైట్ అపరేషన్ పూర్తి చేసుకుని బేస్​ క్యాంప్​నకు తిరుగుప్రయాణమయ్యారు. భద్రతా బలగాల కాన్వాయ్​ బీజాపుర్​లోని కుట్​రూ హరదారిపై వెళుతున్న క్రమంలో అంబేలీ గ్రామం వద్ద మావోయిస్టులు ఐఈడీ పేల్చేశారు. 

భారీ పేలుడు ధాటికి కాన్వాయ్​లోని ఓ వాహనం చెల్లాచెదురుగా పడిపోయింది. దీంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగింది. పేలుడు జరిగిన ప్రాంతంలో పెద్ద గుంత ఏర్పడింది. దీనిపై సమాచారం అందుకున్న వెంటనే సహాయక చర్యల కోసం ఘటనాస్థలికి రీఇన్​ఫోర్స్​మెంట్​ టీమ్స్​ను పంపించినట్లు ఐజీ సుందర్​రాజ్ తెలిపారు. 

ఇదిలా ఉండగా, గత రెండేళ్లలో భద్రతా సిబ్బందిపై నక్సలైట్లు జరిగిన అతిపెద్ద దాడి ఇదేనని ఓ అధికారి వెల్లడించారు.  అయితే కూంబింగ్ త‌ర్వాత తిరిగి వెళ్తున్న జ‌వాన్ల వాహ‌నాన్ని ల‌క్ష్యంగా చేసుకుని పేలుళ్ల‌కు పాల్ప‌డిన‌ట్లు పోలీసులు తెలిపారు. పేలుడు జ‌రిగిన ప‌రిస‌ర ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ చేప‌ట్టారు. భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. మావోయిస్టుల చేసిన ఈ దాడిపై ఛత్తీస్​గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్​ సాయ్ తీవ్రంగా స్పందించారు.

 “బీజాపుర్​లో నక్సలైట్లు జరిపిన దాడిలో 8 మంది జవాన్లు వీరమరణ పొందారనే వార్త చాలా బాధాకరం. అమరుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. అమరులైన జవాన్ల ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. బస్తర్​లో జరుగుతున్న నక్సల్స్​ నిర్మూలన చర్యలపై నక్సలైట్లు విసుగు చెందుతున్నారు. అందుకే ఈ పిరికిపంద చర్యలకు పాల్పడుతున్నారు. జవాన్ల బలిదానం వృథా కాదు, నక్సలిజాన్ని అంతం చేసేందుకు మా పోరాటం బలంగా కొనసాగుతుంది” అని ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణు దేవ్ ఎక్స్​లో పోస్ట్ చేశారు.

శనివారం అర్థరాత్రి ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ ప్రాంతంలో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందగా ఓ డీఆర్​జీ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే గత రెండు రోజులుగా భద్రతా దళాలు మావోయిస్టుల కోసం గాలిస్తున్నాయి. ఈ క్రమంలోనే మావోయిస్టులు జవాన్ల కాన్వాయ్​పై దాడి చేశారు.

2023 ఏప్రిల్​ 26న దంతెవాడ జిల్లాలో భద్రతా సిబ్బందిని తీసుకువెళుతున్న కాన్వాయ్​పై నక్సలైట్లు ఇలాగే దాడి చేశారు. ఆ ఘటనలో 10మంది పోలీసులు సిబ్బంది సహా ఓ డ్రైవర్ మృతిచెందాడు. మరోవైపు శనివారం ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్ పూర్, దంతెవాడ జిల్లా సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టుల సంఖ్య ఐదుకి పెరిగింది. ఇక వీరిలో ఇద్దరు మహిళలని భద్రతా దళాలు వివరించాయి.ఈ ఎన్ కౌంటర్‌లో పోలీస్ హెడ్ కానిస్టేబుల్ సైతం మరణించిన విషయం విధితమే.