ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు ప్రమాణ స్వీకారం

ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు ప్రమాణ స్వీకారం
ఒడిశా గవర్నర్‌ గా డా. కంభంపాటి హరిబాబు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చక్రధారి శరణ్‌ సింగ్‌ ప్రమాణం చేయించారు. రాజధాని భువనేశ్వర్‌ లోని రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌, మాజీ ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, బీజేపీ నేతలు తదితరులు పాల్గొన్నారు.

కాగా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన కంభంపాటి హరిబాబు 2021 జులైలో తొలిసారి మిజోరం గవర్నర్‌గా నియమితులైన విషయం తెలిసిందే. ఒడిశా గవర్నర్‌ రఘుబర్‌దాస్‌ రాజీనామాతో ఆయన స్థానంలో కంభంపాటి హరిబాబును నియమిస్తూ గతేడాది డిసెంబర్‌లో కేంద్రం ప్రకటించింది. ఆయన గతంలో విశాఖపట్నం నుండి ఎమ్యెల్యేగా, ఎంపీగా ఎన్నికయ్యారు. రాష్ట్ర బిజెపి అధ్యక్షునిగా కూడా పనిచేశారు.

జనవరి 2న, కంభంపాటికి మిజోరం ముఖ్యమంత్రి లాల్దుహోమా సాంప్రదాయ  వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. లెంగ్పుయ్ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన తన ఉత్సవ వీడ్కోలు కార్యక్రమంలో, మిజోరంలో తన పదవీకాలంలో తనకు లభించిన ఆత్మీయ ఆతిథ్యం, ఆప్యాయతకు కంభంపాటి కృతజ్ఞతలు తెలిపారు.

మిజోరం పురోగతికి గణనీయమైన సామర్థ్యాన్ని ప్రస్తావిస్తూ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి సమిష్టి ప్రయత్నాలను కోరారు. కంభంపాటి మిజోరం పట్ల తనకున్న లోతైన అనుబంధాన్ని వ్యక్తం చేశారు.  రాష్ట్ర భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా కేంద్ర హోంశాఖ మాజీ కార్యద‌ర్శి అజ‌య్ కుమార్ భ‌ల్లా ఇవాళ మ‌ణిపూర్ గ‌వ‌ర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భ‌వ‌న్‌లోని ద‌ర్బార్ హాల్‌లో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జ‌రిగింది.