న‌లుగురికి ఖేల్‌ర‌త్న అవార్డులు

న‌లుగురికి ఖేల్‌ర‌త్న అవార్డులు
భార‌త అత్యున్న‌త క్రీడా పుర‌స్కారం మేజ‌ర్ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌ర‌త్న అవార్డుల‌ను కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ప్ర‌పంచ చెస్ ఛాంపియ‌న్‌షిప్ విజేత గుకేష్‌కు, షూటింగ్‌లో ఒలింపిక్స్ ప‌త‌క విజేత మ‌నుబాక‌ర్‌కు, హాకీ క్రీడాకారుడు హ‌ర్మ‌న్‌ప్రీత్‌సింగ్‌కు, పారా ఒలింపిక్స్ స్వర్ణ ప‌త‌కం విజేత‌ ప్ర‌వీణ్ కుమార్‌కు ఖేల్‌ర‌త్న అవార్డులు వ‌రించింది.
 
ఖేల్‌రత్న సాధించిన ఆటగాళ్లు గొప్ప ఘనతలు సాధించడంతోనే అవార్డుకు ఎంపికయ్యారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన అథ్లెట్‌గా మను బాకర్ నిలిచింది. పర్సనల్ ఈవెంట్‌తో పాటు మిక్స్‌డ్ డబుల్స్‌లో ఆమె కాంస్య పతకాలు కొల్లగొట్టింది. ఫస్ట్ లిస్ట్‌లో ఆమె పేరు రాలేదు. కానీ తాజా జాబితాలో ఆమె పేరును చేర్చారు.
 
 వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్ విజేతగా నిలిచి రికార్డు క్రియేట్ చేసిన గుకేశ్‌నూ ఖేల్‌రత్న వరించింది. ఒలింపిక్స్‌లో హాకీలో వరుసగా సెకండ్ మెడల్ సాధించడంలో కీలకపాత్ర పోషించిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కూడా పురస్కారానికి ఎంపికయ్యాడు. పారాలింపిక్స్‌లో హైజంప్ కేటగిరీలో గోల్డ్ మెడల్ కొట్టిన ప్రవీణ్‌ కూడా ఈ గౌరవాన్ని అందుకున్నాడు. 
 
ఇక, 17 మంది పారా అథ్లెట్లు స‌హా 32 మంది క్రీడాకారులకు అర్జున అవార్డులు ప్రకటించింది కేంద్రం. ఇందులో జ్యోతి యర్రాజి (అథ్లెటిక్స్), అన్ను రాణి (అథ్లెటిక్స్), నీతు (బాక్సింగ్), స్వీటీ బురా (బాక్సింగ్), వంతిక అగర్వాల్ (చెస్) తదితరులు ఉన్నారు. ఈ నెల 17న ఖేల్‌ర‌త్న అవార్డుల‌ను రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ప్ర‌దానం చేయ‌నున్నారు.
వీరిలో పారిస్‌ పారాలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన ఓరుగ‌ల్లు ముద్దుబిడ్డ‌, పారా అథ్లెట్ జీవాంజి దీప్తికి కూడా అర్జున అవార్డు వ‌రించింది. పారా ఒలింపిక్స్‌లో భాగంగా మహిళల 400 మీటర్ల T20లో ఫైనల్‌లో 55.82 సెకన్లలో లక్ష్యాన్ని ఛేదించి మూడో స్థానంలో నిలిచింది. ప్రపంచ రికార్డుతో కాంస్య పతకాన్ని సాధించింది. తెలంగాణకు తొలిసారిగా ఒలింపిక్స్‌లో పతకాన్ని సాధించి పెట్టింది. దీప్తి స్వస్థలం వరంగల్‌ జిల్లా కల్లెడ గ్రామం.